కరోనా పరీక్షలు చేయించుకునే వారికి షాకింగ్ న్యూస్..!

గత కొన్ని నెలలుగా భారత్ సహా మరికొన్ని దేశాలలో అడ్డూఅదుపు లేకుండా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు కరోనా వైరస్ లక్షణాలుగా కనిపిస్తున్నాయి. వైద్యులు సైతం ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే కరోనా పరీక్ష చేసే సమయంలో స్వాబ్ తీసుకునే సిబ్బంది కొంత నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ముప్పు అని తాజాగా జరిగిన ఒక ఘటనతో నిరూపితమైంది.

అమెరికాకు చెందిన ఒక మహిళ కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోవడానికి వెళ్లింది. అయితే కరోనా పరీక్ష చేయించుకున్న తరువాత మహిళ ఊహించని ఆరోగ్య సమస్యల బారిన పడింది. మహిళ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు విధాలుగా వైద్య సిబ్బంది కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వైద్య సిబ్బంది ఎక్కువగా ముక్కు, నోటి నుంచి స్రావాలు(స్వాబ్) ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలా అమెరికాలోని ఒక మహిళకు కూడా కరోనా పరీక్షలను నిర్వహించారు. ఆ మహిళకు పరీక్షలు చేసే సమయంలో పరీక్ష కోసం ఉపయోగించే పుల్ల పొరపాటున మెదడు పొరకు తగిలింది. ఫలితంగా మెదడుకు సంబంధించిన పొర నుంచి లిక్విడ్ బయటకు వచ్చింది. దీంతో ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కరోనా పరీక్షలు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బంది పరీక్ష నిర్వహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తలు తీసుకోని పక్షంలో వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పరీక్షల సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే పరీక్ష చేయించుకునే వ్యక్తి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. వైద్య సహాయకులు స్రావాలు తీసే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు.