Telugu Language : ఇండియాలో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమందో తెలుసా… తెలుగు భాష ఎన్నో స్థానంలో ఉందో తెలుసా…!

Telugu Language : మానవులలో అత్యంత అందమైన విషయం వారి భాష. భాష మనిషికి మనిషికి మధ్య సంబంధాలను పెంపొందించేదిగా ఉండాలి. ఏ భాషకైనా అదే ప్రమాణం. ప్రతి భాషకూ తనదైన అందం ఉంటుంది. మన దేశంలో చాలా జాతులు తెగలు ఉండటం వల్ల దేశం మొత్తం ఒకే భాష లేదు. కానీ అందరు కలిసి మెలిసి జీవిస్తాము. ప్రతి భాషని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ జీవిస్తున్నాం. అందుకే మనది భిన్నత్వంలో ఏకత్వం.

తెలుగు భాష 4వ స్థానంలో ఉంది…

దేశంలో కనీసం పది వేల మంది మాట్లాడే భాషను గుర్తిస్తారు. అలా మన దేశంలో సుమారు 121 భాషలు ఉన్నాయి. 19,500 భాషలు, యాసలు మన దేశంలో మొత్తంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తెలుగు మాతృభాష మరియు అధికార భాష. ఈ రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రాథమిక అధికారిక భాష హోదా కలిగిన కొన్ని భాషలలో హిందీ, బెంగాలీలతో పాటు తెలుగు కూడా ఉంది. పుదుచ్చేరిలోని యానం జిల్లాలో తెలుగు అధికారిక భాష. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులలో గుర్తించబడిన అల్పసంఖ్యాక భాష. దేశ ప్రభుత్వం భారతదేశ ప్రాచీన భాషగా గుర్తించిన ఆరు భాషలలో తెలుగు ఒకటి. ఇక తాజాగా 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఎంతమంది ఏ భాషను మాట్లాడుతున్నారో, ఆ సంఖ్యను బట్టి భాష స్థానాన్ని నిర్ణయించారు.

ఇందులో మొదటి స్థానంలో హిందీ నిలిచింది. 52.83 కోట్ల మంది హిందీ మాట్లాడుతున్నారు.
ఇక బెంగాలీ 9.72 కోట్ల మంది మాట్లాడుతూ రెండవ స్థానంలో నిలిచింది.
ఇక 8.30 కోట్ల మంది మాట్లాడుతూ మరాఠి మూడో స్థానంలో నిలిచింది.
మన తెలుగు భాష 8.11 కోట్ల మంది మాట్లాడుతూ నాలుగో స్థానంలో నిలిచింది.
6.90 కోట్ల మంది మాట్లాడుతూ తమిళం ఐదవ స్థానంలో నిలిచింది.
ఆరవ స్థానంలో 5.54 కోట్ల మంది మాట్లాడుతూ గుజరాతి నిలిచింది.
5.07 కోట్ల మంది మాట్లాడుతూ ఉర్దూ ఏడవ స్థానంలో ఉంది.
4. 37 కోట్ల మంది మాట్లాడుతూ కన్నడ ఎనిమిదవ స్థానంలో ఉంది.
3.75 కోట్ల మంది మాట్లాడుతూ ఒడియా భాష తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
ఇక 3.48 కోట్ల మంది మాట్లాడుతూ మలయాళం పదవ స్థానంలో నిలిచింది. అలా దక్షిణాది ద్రావిడ భాషలలో ఎక్కువమంది మాట్లాడే మొదటి భాషగా తెలుగు నిలిచింది. మిగిలిన మూడు భాషలు టాప్ పది లోనే ఉండటం విశేషం.