BRS : బీఆర్ఎస్ ను బలోపేతం చేసుకోవాలంటే ముందుగా గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలన్నది రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్ ఆలోచన. తెలంగాణలో సైతం అలాగే చక్కబెట్టుకుంటూ వచ్చారు. ముందుగా మునిసిపాలిటీలో పోటీకి దిగి.. దానిని హస్తగతం చేసుకున్న మీదట రాష్ట్రంపై దృష్టి సారించారు. మహారాష్ట్రలో సైతం ఈ ఫార్ములా అమలు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఖాతా తెరిచేందుకు భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికలో పాల్గొన్నారు. ఇక్కడ ఖాతా ఓపెన్ చేయడం ద్వారా మహారాష్ట్రలో కొత్త పార్టీ తాలుకు సంకేతాలను అక్కడ ప్రభుత్వానికి తెలియజేయాలనుకున్నారు. పెద్ద ఎత్తున నేతలను సైతం ఆకర్షించి కండువాలు కప్పారు. ఇక ఇక్కడి ఎన్నికల్లో గెలిచేందుకు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారు. కానీ ఏ రాష్ట్రంలో అయినా ఒక సెంటిమెంట్ ఉంటుంది. పక్క రాష్ట్రానికి చెందిన నేతలను అంత త్వరగా అక్కున చేర్చుకునేందుకు ప్రజానీకం అంగీకరించదు. మహారాష్ట్రలోనూ ఇదే జరిగిందనుకుంటా.. వెరసి బీఆర్ఎస్ బొక్కబోర్లా పడింది.
కుట్టు మిషన్ గుర్తుతో ఎన్నికల బరిలోకి..
భోకర్ మార్కెట్ కమిటీలోని 18 డైరెక్టర్ పోస్టులకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ అసలు సోదిలో లేకుండా పోయింది. నిజానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. అక్కడి పరిస్థితులు ఆయన తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నారు. కుట్టు మిషన్ గుర్తుతో ఎన్నికల్లో దిగారు. సమావేశాలకు వస్తున్న ఆదరణ చూసి ఎన్నో కొన్ని పోస్టులను కైవసం చేసుకోవడం ఖాయమనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. కనీసం బీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్యే అభ్యర్థి నాగనాథ్ కూడా విజయం సాధించలేకపోయారు. 18 డైరెక్టర్ పోస్టులకు గానూ.. కాంగ్రెస్ 13, ఎన్సీపీ 2, బీజేపీ 3 డైరెక్టర్ పోస్టులను గెలుచుకుంది. బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున డబ్బు పంచినా కూడా ఖాతా తెరవలేకపోయింది. పోలైన ఓట్ల పరంగా చూస్తే కాంగ్రెస్కు 3,909, బీజేపీకి 2,106, బీఆర్ఎస్కు 1,153 ఓట్లు పోలయ్యాయి.
చావు దెబ్బ కొట్టిన అశోక్ చవాన్..
మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించకుండా అడ్డుకోవడంలో మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ కీలక నేత, ప్రస్తుత భోకర్ ఎమ్మెల్యే అశోక్ చవాన్ కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా అడ్డుకోగలిగారు. బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసిన కీలక నేత నాగనాథ్కు ఈ పార్టీ తరుఫున పోటీ చేసిన ఇతర అభ్యర్థుల కంటే కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి. కానీ ఏం లాభం? విజయం వరించలేదు. ప్రతి చోటా విజయం సాధించేందుకు అవకాశమున్న అభ్యర్థులను రంగంలోకి దింపారు. బీఆర్ఎస్ అమలు చేసిన ప్రతి ఒక్క ప్రయత్నాన్ని గట్టిగా తిప్పికొట్టారు. మొత్తానికి బీఆర్ఎస్ను అశోక్ చవాన్ చావు దెబ్బ కొట్టారు. మార్కెట్ కమిటీలో మొత్తం 18 డైరెక్టర్ పోస్టులకు గాను 11 డైరెక్టర్ పోస్టులకు రైతు సహకార సంఘాల ప్రతినిధులు, నాలుగింటికి గ్రామ పంచాయతీ ప్రతినిధనులు, రెండింటికి వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఒక దానికి హమాలీ యూనియన్ ప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. వీటిలో దేనికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కనీస మద్దతు లభించలేదు.
కొత్త సంస్కృతికి బాట వేసిన బీఆర్ఎస్..
మొత్తానికి బీఆర్ఎస్కు మహారాష్ట్రలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. తొలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మరి ఇకపై కేసీఆర్ దూకుడు పెంచుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక్క సీటు గెలుచుకున్నా కూడా బీఆర్ఎస్ హవా మరోలా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఫలితం దక్కలేదు. నిజానికి మహారాష్ట్ర ఎన్నికల్లో పెద్ద ఎత్తున నిధుల వరద పారిన ఘటనలు గతంలో ఎన్నడూ లేవట. ఈసారి ఈ కొత్త సంస్కృతికి బాట వేసింది మాత్రం బీఆర్ఎస్ అనే చెప్పాలి. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెడుతుంటడంతో కాంగ్రెస్, బీజేపీలు సైతం నోట్లను బయటకు తీయాల్సి వచ్చింది. ఇంత చేసినా కేసీఆర్ ప్రయత్నాలేవీ వర్కవుట్ కాలేదు. వెరసి బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఇక మీదట ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.
శుక్రవారం అమావాస్య రోజు హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున మహాలక్ష్మీ దేవిని ఆరాధించడం…
మన రోజువారీ జీవితంలో నిద్రకు ఉపయోగించే దిండు (Pillow) గురించి చాలా మంది పెద్దగా ఆలోచించరు. మంచిగా కనిపిస్తే, మృదువుగా…
ఐపీఎల్ 2026 సీజన్లో అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. వేలంలో పెద్దగా డిమాండ్ లేకపోయిన ఒక ఆటగాడు, ఇప్పుడు మైదానంలో తన…
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. వరుస పరాజయాలు జట్టుపై ఒత్తిడిని…
ప్రసవం తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోనల్ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల ప్రభావం చర్మం, శక్తి స్థాయి మాత్రమే…
ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది.…