Budda Venkanna : పాపం బుద్ధా వెంకన్న.. మాజీ ఎమ్మెల్సీ.. ఆయన ఎప్పుడంటే అప్పుడు మీడియా ముందు వాలిపోయేవారు. టీడీపీపై ఏ చిన్న విమర్శ వచ్చినా కూడా ఖండించనిదే వదిలేవారు కాదు.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు వీరవిధేయుడు. ఎన్నికలకు ముందు కూటమి గెలవకుంటే నాలుక కోసుకుంటానని.. రక్తంతో గోడపై చంద్రబాబు జిందాబాద్ అంటూ రాసి హాట్ టాపిక్గా మారారు. చంద్రబాబు చిత్ర పటంలోని కాళ్లను తన రక్తంతో కడిగారు. అంతటి కరుడు గట్టిన చంద్రబాబు అభిమాని బుద్ధా వెంకన్న. ఒకప్పుడు కేశినేని నానిపై ఒంటికాలుపై లేచేవారు. నాని వర్సెస్ బుద్ధా వెంకన్న బీభత్సంగా నడిచింది. ఆ తరువాత చంద్రబాబు ఒక్క కనుసైగతో బుద్దా సైలెంట్ అయిపోయారు. అదీ చంద్రబాబుకు బుద్దా ఇచ్చే గౌరవం.. అభిమానం. అలాంటి బుద్దాకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాలేదు. పొత్తుల కారణంగా నష్టపోయిన టీడీపీ సీనియర్ నేతల్లో ఆయన కూడా ఒకరు.
టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నా..
అప్పుడంటే ఎమ్మెల్సీ.. ఈసారి తప్పక ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ తానొకటి తలిస్తే.. కూటమి మరొకటి తలచింది. బుద్దా వెంకన్న ఇప్పుడు కేవలం మాజీ ఎమ్మెల్సీ అంతే.. తనకు ఏదో ఒక పదవి దక్కక పోతుందా అని కళ్లలో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు ఎందుకో బుద్దా వైపు చూడలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇంకా చంద్రబాబుకు కూడా అవకాశం రాకపోయి ఉండొచ్చు. దీంతో ఆయన్ను నిరాశా నిస్పృహలు కమ్మేసినట్టున్నాయి. పాపం ఏదేదో మాట్లాడేశారు. ఎన్నడూ లేనిది తీవ్ర అసంతృప్తితో బుద్దా మాట్లాడారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న బుద్దా మాట్లాడిన మాటలు కేడర్ను కదిలించేశాయి. తనకు ఎలాంటి పదవీ లేకపోవడంతో తననెవరూ లెక్క చేయడం లేదని.. అసలు తన మాట చెల్లడమే లేదని.. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించుకోలేకపోతున్నానంటూ బుద్దా వెంకన్న తెగ ఫీలయ్యారు.
అసెంబ్లీలో అడుగు పెడతా..
ఒకప్పుడు చంద్రబాబు ఇంటి మీదకు జోగి రమేష్ దాడికి వెళ్తే తాను అడ్డుగా నిలబడ్డానని.. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేల్లో అప్పుడు ఎవరైనా వచ్చారా? అని ప్రశ్నించారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా తనపై పెట్టిన కేసుల దగ్గర నుంచి చాలా విషయాలను బుద్దా గుర్తు చేసుకుని తల్లడిల్లిపోయారు. తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతోనే ఇదంతా చెబుతున్నానని.. వ్యతిరేకతతో కాదన్నారు. 2029లో మాత్రం ఎలాగైనా టికెట్ దక్కించుకుని అసెంబ్లీలో అడుగు పెడతానంటూ మంగమ్మ శపథం ఒకటి చేసేశారు. చివరిగా తను చనిపోయే వరకూ టీడీపీలోనే కొనసాగుతానని బుద్దా వెంకన్న తెలిపారు. వాస్తవానికి బుద్దా వెంకన్న మాత్రం పార్టీని నిత్యం అంటిపెట్టుకుని.. అండగా ఉండే నేత. పార్టీపై అంకితభావం, నిబద్ధత కలిగిన నేత. ఇలాంటి నేతలను చంద్రబాబు ఏదో ఒక పదవి ఇచ్చి గౌరవించాల్సిందే. చంద్రబాబు సర్.. ఇప్పటికైనా బుద్దా ఆవేదన గుర్తించండి.. ఆయనకొక పదవి అర్జంటుగా ఇచ్చేయండి..
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…