ఏదన్నా సాధించాలని పట్టుదల ఉంటే చాలు మనుషులు ఋషులవుతారు. ఒక ప్రయత్నం తోనే ఉన్నత స్థాయికి ఎదిగి, అవార్డులు, రివార్డులు, పేరు ప్రఖ్యాతలు రావాలంటే అది నిజంగా అత్యాశ అనే చెప్పాలి. అయితే కొందరికి అవార్డులు వాటంతట అవే వెతుకుంటూ వస్తాయి. అలాంటి కోవకి చెందిన గొప్ప వ్యక్తులలో రామోజీరావు గారు ఒక్కరు .. !! మనం ఉదయం లేవగానే మనల్ని పలకరించే ఈనాడు వ్యవస్థాపకులే రామోజీరావు. రామోజీరావు గారు పద్మవిభూషణ్ గ్రహీత. రామోజీరావు పేరు వింటేనే తెలుగువారందరికీ ఒక స్ఫూర్తి. తెలుగునాట ఆయన ప్రమేయం లేని రంగం లేదు. అసలు అయన ఇంతలా గొప్పగా ఎదగడానికి కారణమ్ కూడా ఉంది. మొదట్లో అయన ఉద్యోగానికి ఒక ఇంటర్వ్యూ కి వెళ్ళాడట. అయితే అక్కడ ఆ ఇంటర్వ్యూ లో రామోజీరావు సెలెక్ట్ అవ్వలేదు. దీనితో నేను ఉద్యోగానికి పనికి రానా అని అనుకుని, ఒక దృఢ నిశ్చయంతో నేను ఉద్యోగం చేయడం కాదు, నేనే ఎంతోమందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలని గొప్ప పట్టుదలతో ముందుకు సాగాడు. అలా ఆయనలో పట్టుదల మొదలై ఇప్పుడు ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు.
రామోజీరావు క్రమశిక్షణకి మారుపేరు. సూర్యుణ్ని ఆరాధించే ఆయన నిర్విరామంగా పనిచేస్తారు. తెల్లవారుజామున మూడు గంటలకే ఆయన దినచర్య మొదలవుతుంది. సూర్యోదయానికి ముందే ముఖ్యమైన దినపత్రికలు చదివేస్తారు. ఉదయం నడక ఆయనకు ప్రాణ సమానం. తన సంస్థలపై లక్షల మంది ఆధారపడినందున వారి శ్రేయస్సూ, భవిష్యత్తూ తన ఆరోగ్యంపై ఆధారపడి ఉన్నాయని నమ్ముతారు. తను క్రమశిక్షణగా ఉంటూ ఇతరులను క్రమశిక్షణతో నడిపిస్తారు. దేన్ని చేపట్టినా నిశితమైన ఆలోచన, లోతైన అధ్యయనం, ప్రణాళికాబద్ధమైన కృషి ఆయనకు అలవాటు. ఎనభయ్యో సంవత్సరంలోకి వచ్చిన ఆయనలో దీక్షాదక్షతలు ఏమాత్రం తగ్గలేదు. ఈ వయసులో ఎవరైనా విశ్రాంతి కోరుకుంటారు.కానీ రామోజీరావు మాత్రం పనిలోనే విశ్రాంతి అంటారు. కాలంతో పోటీపడి పనిచేస్తారు. సమయపాలన కచ్చితంగా పాటిస్తారు. ఆరునూరైనా ఉదయం పది గంటలకు ఆఫీసులో ఉంటారు. సమావేశాలకు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కారు. అపాయింట్మెంట్ ఇస్తే కచ్చితంగా ఆ సమయానికి అందుబాటులో ఉంటారు. తెలుగువారికీ, తెలుగునేలకీ ఆయన చేసిన, చేస్తున్న సేవ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. తెలుగు భాష చెక్కుచెదరకుండా ఉండటానికి, సగౌరవంగా నిలవడానికి రామోజీరావు ప్రధాన కారకులని రాబోయే తరాలు చెప్పుకొనేటట్లుగా ఆయన తెలుగు జాతినీ, భాషనీ ప్రభావితం చేస్తున్నారు. తెలుగుభాష పూర్తిగా ఆంగ్లమయం అవుతున్న తీరు ఆయన్ని కలచివేస్తోంది. తను ప్రాణ సమానంగా భావించే ఈనాడులో ఆంగ్లాన్ని పూర్తిగా పరిహరించాలని కంకణం కట్టుకున్నారు. పత్రికలోనూ, ఈటీవీ వార్తల్లోనూ ఆంగ్లపదాలు దొర్లకుండా కట్టడిచేసి భాషకి ప్రాణం పోస్తున్నారు. ఈ క్రమంలో వందలకొలది తెలుగుపదాలు జనించాయి.
రామోజీరావు కు సినిమాలు అంటే చాలా ఇష్టం. శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా ఆయనకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమా. రామోజీరావు నిర్మించిన సినిమాలూ చరిత్ర సృష్టించాయి. బడ్జెట్ వేలంవెర్రిలో కొట్టుకుపోకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు నిర్మించడం ఆయనకు అలవాటు. జన సామాన్యంలో జరిగే సంఘటనల్నే కథావస్తువులుగా స్వీకరించారు. మౌనపోరాటం, ప్రతిఘటన, మయూరి, పీపుల్స్ ఎన్కౌంటర్, అశ్విని సినిమాలు అలాంటివే. ఇవన్నీ మంచి సినిమాలుగా గుర్తింపు పొందడమే కాక, ఆర్థికంగా గొప్ప విజయాలు సాధించాయి. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమాల ద్వారా ఎంతోమంది నటీనటులు, దర్శకులు వెండితెరకు పరిచమయ్యారు. జైపూర్ చెక్క కాలితో నాట్యం చేసే సుధాచంద్రన్ ని, పరుగుల రాణి అశ్విని నాచప్పని కథానాయికలుగా, కీరవాణిని, ఎస్.జానకిని సంగీత దర్శకులుగా, జూనియర్ ఎన్టీఆర్, శ్రియలాంటి ఎంతోమందిని తారలుగా మలచిన ఘనత ఆయనదే. 30 ఏళ్లలో ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు. భాషా సేవకులు, ప్రేమికులు, అభిమానుల ఆకాంక్షల్ని ఒక చోటకు చేర్చి తెలుగు భాషకి వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతో 2012లో రామోజీరావు తెలుగు వెలుగు ప్రారంభించారు. చిన్నారుల్లో తెలుగు భాషానురక్తిని పెంచడానికి ‘బాలభారతం’ పత్రికనూ ప్రారంభించారు. తెలుగులో బాల సాహిత్యంలో ఎంత కొరత ఉందో బాలభారతం పత్రికకు లభిస్తున్న ఆదరణని చూస్తే తెలుస్తుంది. తెలుగుభాష అంటే అభిమానంతోనే తన రెండో కుమారుడు సుమన్ కి కొండవీటి వెంకటకవి గారితో ఏడేళ్లపాటు శిక్షణ ఇప్పించారు.
మనవరాళ్లు, మనవడితో తెలుగులోనే మాట్లాడతారు. ఒక్క ఆంగ్లపదం దొర్లకుండా తెలుగులో మాట్లాడాలని వారితో పోటీపెట్టుకోవడం ఆయనకు అలవాటు. హైదరాబాదులో రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణం కావడం తెలుగువారికి ఎంతో ప్రాచుర్యాన్నీ, గుర్తింపునీ తెచ్చింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ బుక్ లో పేరు ను సంపాదించుకుంది. దేశంలో అన్ని భాషల సినిమాలూ ఇందులో నిర్మాణమవుతున్నాయి. ఇక్కడికి రాని భారతీయ సినీ ప్రముఖులు లేరు. ఏడాదికి సగటున 13 లక్షల మంది పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తున్నారు. ఉర్దూ నుంచి కన్నడం వరకు, గుజరాతీ నుంచి బంగ్లా వరకు ఎన్నో ప్రాంతీయ భాషల్లో టెలివిజన్ ఛానళ్లను తెలుగు నేలపై ఆవిష్కరించడం భాగ్యనగరానికీ ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. రామోజీ ఫిల్మ్ సిటీ లోని ఈటీవీ భవనం ఒక మినీ పార్లమెంట్ లాగా ఉంటుంది. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. పారిశ్రామికవేత్తగా, పత్రికా సంపాదకుడిగా, స్టూడియో వ్యవస్థాపకునిగా, సినీ నిర్మాతగా, వ్యాపారవేత్తగా ఎన్నో రంగాల్లో రాణించారు. అన్నింటిలోకి జర్నలిజమే ఆయనకు అమితంగా ఇష్టమైనది. రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయిస్తారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్గా కూడా రామోజీరావు పనిచేశారు. ఆ పదవికి అందరికన్నా ఆయనే ఎక్కువ అర్హులు. రామోజీరావు సంపాదకత్వంలో నడిచే ‘అన్నదాత’ దేశంలోనే అగ్రగామి వ్యవసాయ మాసపత్రిక. 1969లో దీనిని ప్రారంభించారు. ఆయన ప్రారంభించిన మొదటి పత్రిక ఇదే. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు రైతులంటే ఎంతో అభిమానం.
అన్నదాతల మేలుకోసం ఈనాడు దినపత్రికలో సైతం ‘రైతేరాజు’ శీర్షికని ప్రవేశపెట్టారు. ఈ వ్యాసాల్ని రైతులు మాట్లాడుకొనే భాషలో ఇవ్వడం వల్ల వారి ఆదరణకు పాత్రమైంది. రామోజీరావుది మొదటి నుంచీ వినూత్న శైలి. 1978లోనే ‘విపుల, చతుర’ సాహిత్య పత్రికల్ని ప్రారంభించడం ఇందుకొక ఉదాహరణ. ప్రపంచ భాషల్లోని అత్యుత్తమ కథల్ని అనువదించి తెలుగువారికి అందించడానికి ఆయన ‘విపుల’ పత్రిక ప్రారంభించారు. ఇలాంటి ప్రయత్నం, ప్రయోగం అంతకుముందెన్నడూ, ఎక్కడా లేదు. ఉత్తమ సాహిత్యాన్ని నెలానెలా నవల రూపంలో, చౌకగా పాఠకులకు అందించాలనే ఆలోచనతో మొదలైంది ‘చతుర’ పత్రిక. ఈటీవీ ద్వారా ఎంతో మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు వెలుగులోకి వచ్చారు. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ఆణిముత్యాల్లాంటి వందల మంది గాయనీ గాయకులను ప్రపంచానికి అందించింది. ‘తెలుగువెలుగు’ ఎందరో భాషావేత్తలకు, రచయితలకు, కవులకు అత్యుత్తమ వేదికగా, తెలుగు భాషకి ఆలంబనగా నిలుస్తోంది. ఎందరో జాతిరత్నాల్ని ‘మార్గదర్శి’ ద్వారా పరిచయం చేస్తూ ఈటీవీ దేశభక్తినీ, సమాజ సేవనూ పెంపొందిస్తోంది. అన్నదాత, జైకిసాన్ కార్యక్రమాలు రైతులకు చేస్తోన్న మేలు అంతా ఇంతా కాదు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…