ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. దసరా పండుగ సమయంలో ఉద్యోగులకు తీపికబురు అందించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో లాక్ డౌన్ అమలు వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆదాయం తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. కొన్ని రోజుల క్రితమే లాక్ డౌన్ సమయంలో కోత విధించిన జీతాలను తిరిగి చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.
ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి నిన్న సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకోగా అడిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు వచ్చే నెలలో ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని సమాచారం. చంద్రశేఖర్ రెడ్డి జగన్ కరోనా సోకిన ఉద్యోగులకు నెల రోజుల పాటు స్పెషల్ లీవ్ ఇవ్వాలని.. ఉద్యోగులకు రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలం ఇవ్వాలని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
ఈ నిర్ణయాల పట్ల జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం అందుతోంది. పీఆర్సీ, సీపీఎస్ అమలు విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. సంఘం ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మహిళా ఉద్యోగులకు 5 రోజుల సెలవులు ఇవ్వాలని, నాలుగో తరగతి ఉద్యోగుల వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని.. ఉద్యోగులకు సౌకర్యాలు, రాయితీలు పెంచాలని కోరామని తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. సీఎం ఎన్జీవో సంఘం అధ్యక్షుడి వినతులకు అనుకూలంగా స్పందించడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.