Actress Jayakumari : ఒకప్పుడు తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 400 కు పైగా సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగారు జయకుమారి. ‘నాడోడి’ అనే తమిళ్ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. తెలుగులో బాలమిత్రులకథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కళ్యాణ మండపం, ఇంటి గౌరవం వంటి సినిమాలలో నటించి అభిమానుల మనసులో నిలిచిపోయారు. వందల సినిమాలలో నటించినప్పటికీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగోలేక దీన స్థితిలో ఉన్నారు.

కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో డబ్బులు లేక ప్రభుత్వాసుపత్రిలో…
జయకుమారి కెరీర్ ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆమెకు ఇద్దరు కుమారులు. జయకుమారి భర్త ఇటీవల మరణించడంతో ఆర్ధికంగా చాలా దయనీయ స్థితిలో ఉన్నారని సినీవర్గాల సమాచారం. ఇక ఇప్పుడు జయకుమారి ఆరోగ్యం కూడా బాలేదు, ఆమె రెండు కిడ్నీలు పాడైపోయినట్టు వైద్యులు తెలిపారట.

ఇక ఈమె పిల్లల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేనట, వాళ్ళు ఇద్దరూ కూడా అద్దె ఇళ్లలో ఉండి జీవనం సాగిస్తున్నారట. పిల్లల పరిస్థితి తెలుసు కాబట్టి వైద్యం నిమిత్తం చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారట. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలా ఉండటంతో అందరూ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఆమె ఎక్కువగా సినిమాలు చేసిన తెలుగు, మలయాళం, తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.




























