హైదరాబాద్: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తాజా వ్యాఖ్యలతో ‘హరి హర వీరమల్లు’ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మొదట ఈ పీరియాడికల్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్, చివర్లో జ్యోతికృష్ణకు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలిన ఈ సమయంలో, క్రిష్ తన మౌనం వీడి సోషల్ మీడియాలో హృదయస్పర్శమైన పోస్టు చేశారు.

పవన్ కళ్యాణ్: “అసాధారణ శక్తికి రూపం, రగిలే అగ్నికణం”
ఆ పోస్టులో ఆయన మాట్లాడుతూ – ‘‘ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలో అడుగుపెడుతున్నాడు. ఈ సినిమా నిశ్శబ్దంగా కాదు, గొప్ప ఆశయంతో చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్టు ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది. ఒకరు పవన్ కల్యాణ్. అసాధారణ శక్తికి రూపం ఉందంటే అది పవన్ కల్యాణ్ రూపంలోనే ఉంటుంది. ఆయన ఒక రగిలే అగ్నికణం. ఎందరికో ఆదర్శం. ఈ సినిమాలో ప్రాణం పోసినవారు ఆయనే. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక.” అని కొనియాడారు.
ఏఎం రత్నం: “భారతీయ సినీ రంగంలో శిల్పి, అచంచలమైన నమ్మకం”
“ఇక మరో లెజెండ్ – నిర్మాత ఏఎం రత్నం. భారతీయ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శిల్పి. ఎంతో విశ్వాసంతో, పట్టుదలతో ఈ సినిమాను నిర్మించారు. ఆయన అచంచలమైన నమ్మకమే ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించింది. ఇది నాకెంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్ట్. ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. కేవలం దర్శకుడిగా కాకుండా కథా రూపకల్పనలోనూ నేనెన్నో విషయాలు నేర్చుకున్నాను.’’ అంటూ పేర్కొన్నారు.
సినిమాపై అంచనాలు, విడుదల
పవన్ కల్యాణ్, ఏఎం రత్నం ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసిన క్రిష్, ఈ సినిమా చాలా సంవత్సరాలుగా ఎదురుచూసిన ప్రేక్షకులకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇస్తుందని చెప్పారు. సినీ ఇండస్ట్రీలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలవనుందని అభిప్రాయపడ్డారు.
ఇకపోతే, ‘హరి హర వీరమల్లు’ మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమై, తరువాత జ్యోతికృష్ణ పూర్తి చేసిన ప్రాజెక్ట్. నిర్మాత ఏఎం రత్నం పర్యవేక్షణలో జ్యోతికృష్ణ చివరి భాగాన్ని కంప్లీట్ చేశారు. ఇటీవల జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ను పొగడ్తలతో ముంచెత్తారు. ఐదు సంవత్సరాల దీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ చిత్రం జూలై 24న విడుదలకు సిద్ధమవుతోంది.


























