కరోనా మహమ్మారి తర్వాత, భారతీయ వినోద పరిశ్రమలో ఓటీటీ (OTT) ప్లాట్ ఫార్మ్ లు తీసుకువచ్చిన మార్పు అసాధారణమైనది. ఓటీటీ విప్లవం, కేవలం సినిమాలు, షోలను చూడటం కంటే, సరికొత్త కంటెంట్ తో లాంగ్వేజ్ బారియర్స్ లేకుండా కంటెంట్ సృష్టించడంతో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ఇది ప్రాంతీయ భాషలకు, కొత్త నటీనటులకు, విభిన్న కథాంశాలకు ఒక పెద్ద వేదికను అందించింది. అప్పటివరకు సినిమాల్లో చెప్పలేని కథలను వెబ్ సిరీస్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇది ఎంతగానో స్వాగతించాల్సిన పరిణామం.

అయితే, సెన్సార్ లేకపోవడం, కేవలం వ్యూస్, డబ్బులనే లక్ష్యంగా పెట్టుకోవడంతో అనేక ప్లాట్ ఫార్మ్ లు బోల్డ్, హింసాత్మక కంటెంట్ ను పెంచాయి. సహజత్వం పేరుతో అశ్లీలత, రక్తపాతం, క్రూరమైన నేరాలను యథాతథంగా చూపించడం మొదలైంది. ఇది కేవలం వినోదం కోసం కాకుండా, యువత ఆలోచనలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందనే ఆందోళన ఇప్పుడు పెరుగుతోంది.
ఇటీవల హైదరాబాద్, కూకట్ పల్లిలో జరిగిన ఒక పాప హత్య కేసు ఈ ఆందోళనలను మరింత పెంచింది. ఓ పదో తరగతి చదువుతున్న బాలుడు ఆ చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. విచారణలో, అతడు “ఓటీటీలో క్రైమ్, కిల్లర్ కథలు చూసి ఇలా చేశాను” అని చెప్పడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పిల్లల మనసులు సున్నితమైనవి. వారు చూసే విషయాలను త్వరగా అనుకరిస్తారు. నిజమైన ప్రపంచానికి, ఊహాజనిత ప్రపంచానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేని వయసులో, హింసాత్మక కంటెంట్ ను చూడటం వల్ల వారు నేరాలను “సాధారణం”గా భావించడం మొదలుపెట్టారు. ఈ ఘటన వెబ్ సిరీస్ లు కేవలం వినోదం మాత్రమే కాదని, సరైన పర్యవేక్షణ లేకపోతే ఎంత ప్రమాదకరంగా మారగలవో స్పష్టంగా తెలియజేసింది.
కొన్ని సిరీస్ లలో హింస, రక్తపాతం, బూతులు కథలో భాగంగా కాకుండా, కేవలం ఆకట్టుకోవడానికి మాత్రమే వాడుతున్నారు. ‘మీర్జాపూర్’ వంటి సిరీస్ లలో ఇదొక సాధారణ అంశంగా మారింది. ఇలాంటి కంటెంట్ యువతలో హింసను సహజమైన విషయంగా భావించేలా చేస్తుంది. నేరాలను చేసే సైకో కిల్లర్లను ‘హీరో’గా చూపించడం వల్ల, వారి మనసులో కూడా అలాగే మారాలనే కోరిక పుట్టే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, సమాజంలో హింసను సహజమని భావించే ధోరణి బాగా పెరుగుతుంది.
ఈ సమస్యను పరిష్కరించడం మన బాధ్యత.. తల్లిదండ్రులు, ప్రభుత్వంతో పాటూ సమాజంలో ఉన్న మనందరి బాధ్యత ఉంది. తల్లిదండ్రులు పిల్లలు చూసే కంటెంట్ పై నిఘా ఉంచాలి. వయస్సు పరిమితి గైడ్ లైన్స్ ను కచ్చితంగా పాటించాలి. వారి మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతోందో అర్థం చేసుకోవాలి. వారితో కూర్చొని కంటెంట్ గురించి మాట్లాడాలి. ప్రభుత్వం కూడా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లపై నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలి. వయోపరిమితి మార్గదర్శకాలను మరింత కఠినంగా అమలు చేయాలి. ముఖ్యంగా, నేరాలను, హింసను పెంచే కంటెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజం కూడా బాధ్యతాయుతమైన వీక్షకులుగా ఉండాలి. అనవసరమైన హింసను ప్రోత్సహించే కంటెంట్ ను తిరస్కరించాలి.
మొత్తం మీద వినోదం మనల్ని ఉల్లాసపరచాలి, అది విజ్ఞతతో కూడి ఉండాలి. తెర వెనుక ఉన్న నేర ప్రపంచాన్ని చూసి, మన నిజ జీవితంలో అలాంటి ఆలోచనలకు తావివ్వకూడదు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక సిరీస్ కాదు, మన సమాజం. వినోదం వివేకాన్ని నాశనం చేయనంతవరకే అది ఒక వరం. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.


























