తాడేపల్లి: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా వినాయక చవితి పూజలో ప్రత్యక్షంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇలాంటి మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండే జగన్, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గణపతి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొని పూజలు నిర్వహించారు.

మతపరమైన కదలికలు
ప్రతి ఏడాది గణపతి ఉత్సవాలు పార్టీ కార్యాలయంలో జరుగుతున్నప్పటికీ, గతంలో ఎప్పుడూ జగన్ వాటిలో పాల్గొనలేదు. ఈసారి మాత్రం ఆయన ప్రత్యేకంగా పూజల్లో పాల్గొనడం, స్వామివారి కథ విని, ప్రసాదం స్వీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ ప్రజలందరి విఘ్నాలు తొలగి, విజయాలు సాధించాలని గణనాథుడిని ప్రార్థించారు.
ఆధ్యాత్మిక సలహా?
ఈ అనూహ్య మార్పు వెనుక విశాఖకు చెందిన స్వరూపానందేంద్ర స్వామి సలహా ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎదురైన ఒత్తిడిని అధిగమించేందుకు జగన్ భక్తితో గణనాథుని ఆశీర్వచనం కోరారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గమనార్హంగా, జగన్ ఈ పూజల్లో నేరుగా పాల్గొనగా, ఆయన సతీమణి భారతి మాత్రం వేడుకలకు దూరంగా ఉన్నారు. ఈ ఘటన భవిష్యత్తులో జగన్ వైఖరిలో మరిన్ని మార్పులకు సంకేతం కావచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.





























