అలా జరగడంతో.. 3 నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చింది : నటి పూర్ణ

సాధారణంగా చాలామందికి టెర్రస్ మీద అంటే మేడ మీద ప్రేమ కథలు జరిగే ఉంటాయి. చిన్నతనం నుంచి ఏదో ఒక సందర్భంలో ఇలా టెర్రస్ పైకి ఎక్కి ప్రేమ వ్యవహారాలను నడిపే ఉంటారు. మేడ మీదకు చదువుకోవడానికి వెళ్లినప్పుడో.. లేదా బట్టలు ఆరేయడానికి వెళ్లినప్పుడో ప్రేమ కథలు నడిచే ఉంటాయి.

ఇలా మేడమీదే అమ్మాయి, అబ్బాయిల చూపులు కలుస్తుంటాయి. అందుకే వీటిని టెర్రస్ లవ్ స్టోరీలు అంటారు. ఇలాంటి స్టోరీలు వారి వారి జీవితంలో జరిగే విషయాలను తమ కళ్ల ముందుకు తీసుకొచ్చేందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టార్ ప్రయత్నిస్తున్నాడు. దాని కోసం తన యూ ట్యూబ్ ఛానల్ లో స్వీయ నిర్మాణంలో వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న శేఖర్ మాస్టర్, బుల్లితెరపై కూడా హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆ మధ్య ఢీ డాన్స్ షో, ఇప్పుడు కామెడీ స్టార్స్‌కి జడ్జీగా ఉన్న శేఖర్ మాస్టర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇలా టెర్రస్ ప్రాజెక్ట్ ప్రమోషన్లో భాగంగా.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ, కామెడీ స్టార్స్ షోలకు సంబందించిన ప్రముఖ సెలబ్రిటీలు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైపర్ ఆది, ప్రియమణి, అనసూయ తమ టెర్రస్ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుని ప్రమోషన్ చేశారు. తాజాగా నటి పూర్ణ తన టెర్రస్ అనుభవాలను పంచుకున్నారు.

ఆమె లవ్ స్టోరీ కాకుండా టెర్రస్ పై జరిగిన ఓ ఘటనను చెప్పుకొచ్చారు. తన ఇంటి చుట్టు పక్కల ఉండే వాళ్లు అంతా తనకు బ్రదర్స్ అని.. అందుకే ఎలాంటి లవ్ స్టోరీలు లేవని చెప్పారు. చిన్నతనంలో ఓ రోజు టెర్రస్ మీద నుంచి కిందపడగా.. తలకు పెద్ద గాయం అయిందని.. మూడు నెలల ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చిందని చెప్పారు. టెర్రస్ లవ్ స్టోరీని చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నామని.. శేఖర్ మాస్టార్ కు ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు పూర్ణ.