‘అఖండ’లో కనిపించిన ఆ గిత్తల చరిత్ర.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఓటీటీల వినియోగం పెరుగుతున్న కొద్ది ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించారు. అలాంటి పరిస్థితుల్లో కొందరి ప్రముఖ హీరోల చిత్రాలు కాస్త ఊరటనిచ్చాయి. కొవిడ్‌ ఫస్ట్‌ వేవ్‌, సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలైన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించగలిగాయి. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ విడుదల కావడంతో థియేటర్ల యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికగా.. రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ఏరియా ఏదైనా ప్రభంజనం సృష్టిస్తోంది. థియేటర్లకు కొత్త వెలుగును తీసుకొచ్చింది. ఇదంతా ఇలా ఉంటే.. సినిమాలో కనిపించిన బసవన్నలు(కోడెలు) చౌటుప్ప ల్‌ మండలం లక్కారం గ్రామానికి చెందినవట. ఆ కోడేల పేర్లు.. కృష్ణుడు, అర్జునుడు.

గ్రామానికి చెందిన నూనె శ్రీనివాస్‌ స్థానికంగా తన వ్యవసాయ క్షేత్రంలో గోశాలను ఏర్పాటు చేశాడు. అందులో రెండేళ్ల క్రితం రెండు గిత్తలను కొనుగోలు చేసి ఇక్కడనే పెంచుతున్నాడు. అంతే కాదు వాటికి నిత్యం వివిధ రకాల శిక్షణ ఇస్తూ.. పేరు పెట్టి పిలిస్తే వచ్చే విధంగా తర్పీదు ఇచ్చాడు. అతడు ఓ రోజు సొంత పని కోసం రామోజీ ఫిలిం సిటీకి వెళ్లాడు.

అక్కడ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ గిత్తలకు సంబంధించి విషయం వచ్చింది. దీంతో అతడు వాళ్లకు తన గిత్తలకు సంబంధించి వీడియో చూపించాడు. వాళ్లకు ఆ గిత్తల నైపుణ్యం నచ్చడంతో షూటింగ్‌కు ఆహ్వానించారు. సంవత్సరం క్రితం రెండు రోజుల పాటు ఇవి షూటింగ్ లో పాల్గొన్నాయి. సినిమాలో ఇవి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. సినిమా మొదట్లో.. చివర్లో కనిపిస్తాయి.
ఇలా బాలయ్య సినిమాలో తన కోడెలు నటించడం ఆనందంగా ఉందని శ్రీనివాస్‌ తెలిపాడు.