సినిమా ఇండస్ట్రీలో ఎంతో గొప్ప సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకులే కమర్షియల్ సక్సెస్ కోసం ఆ తర్వాత చెత్త సినిమా తీసి అడ్రెస్ లేకుండా పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీరిలో అగ్ర దర్శకులు నుంచి మూడు నాలుగు భారీ హిట్స్ తీసిన దర్శకులు ఉన్నారు. ఆ కాలంలో అసభ్యకరమైన సన్నివేశాలు ఒకటి రెండు ఉండేవేమోగానీ, సినిమా మొత్తం ఆశ్లీలమైన సన్నివేశాలతో నింపేసి జనాల మీదకి వదిలిన దర్శక, నిర్మాతలు ఉండేవారు కాదు. అందుకు ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ తరం హీరోలు ఆ తర్వాత తరం అయినా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు కూడా ఒప్పుకోలేదు.

అప్పట్లో కథ పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని అందరికీ నచ్చాలనే కఠినమైన నిర్ణయం, ఉద్దేశం తోనే నాగి రెడ్డి లాంటి అగ్ర నిర్మాతలు, రామానాయుడు, నాగేశ్వర రావు, కృష్ణ లాంటి వారు భావించి సినిమాలు తీసేవారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద నెమ్మదిగా బాలీవుడ్ సహా, మలయాళ సినిమాల ప్రభావం పడుతూ వచ్చింది. దాంతో సినిమాలలో కొంత ఆశ్లీలమైన సన్నివేశాలకి చోటు ఏర్పడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొన్ని శృంగారభరితమైన సన్నివేశాలు ఉండాలని కొంతమంది మేకర్స్ ఓ దారి వేశారు.

దానివల్ల జనాలకి కలిగే మేలేంటో గానీ యువత మీద మాత్రం బాగానే ప్రభావం చూపించిందని చెప్పక తప్పదు. రాజకీయాలు, సినిమాలు జనాల మీద ఎంతగా ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో కథ కంటే సన్నివేశాలకే ప్రధాన్యం పెరిగింది. మారుతి లాంటి కొందరు దర్శకులు కెరీర్ ప్రారంభంలో సక్సెస్ అవ్వాలంటే సినిమా మొత్తం అభ్యంతరకమైన సన్నివేశాలు చూపించి క్లైమాక్స్ లో మాత్రం సోషల్ మెసేజ్ ఇచ్చి ఏదో ఉద్దరించినట్టు చూపించారు. ఇదే ఓ ట్రెండ్ అయిపోయింది.

దాంతో సగం సినిమాలు ఏదో దొరికిన కెమెరాతో ముక్కు మొహం తెలియని వాళ్లని పెట్టి ఘాటు ముద్దు సన్నివేశాలు, పాటలలో ఆశ్లీలత చూపించడం మొదలు పెట్టారు. అలాంటి సినిమాలు ఒకదశలో యూత్ను బాగానే ఆకట్టుకున్నాయి. మలయాళంలో షకీలా ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆమె సినిమా రిలీజ్ అంటే మోహన్ లాల్ మమ్ముటి లాంటి అగ్ర హీరోల సినిమాలు కూడా ఆపేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దాంతో మంచి కథలతో సినిమా తీసి సక్సెస్ కావాలని వచ్చిన దర్శకులు తప్పని పరిస్థితుల్లో జనాలకి కావాల్సింది చూపించాల్సిందే అనే ధోరణికి వచ్చి చెత్త సినిమాలు తీసి అడ్రస్ లేకుండా పోయారు.

అలాంటి ఓ దర్శకుడే కృష్ణంశెట్టి అయోధ్యకుమార్. ఆయన మొదట తీసిన సినిమా మిణుగురులు. ఇలాంటి సినిమా తీయాలంటే మనసులో నుంచే బలమైన ఆలోచన కలగాలి. ఎంత ప్రేరేపితం కాకపోతే మొదటి సినిమా కథను ఇలా ఎంచుకుంటారు. దాదాపు 40మంది అంధ బాల, బాలికలతో సినిమా చేయడం అంటే చాలా పట్టుదల, ఓర్పూ ఉండాలి. చూపు లేని వాళ్ళకి సన్నివేశం వివరించడం దగ్గర్నుంచి చిత్రీకరణ జరపడం, డబ్బింగ్ చెప్పించడం వరకు చాలా సవాళ్ళను ఎదుర్కోవాలి.

అన్నీ సవాళ్ళను ఎదుర్కొని ఫస్ట్ కాపీ వచ్చాక సినిమాకి థియోటర్స్ దొరక్కపోతే.. ఇలాంటి సినిమాను ఎవరు చూస్తారనే కామెంట్స్ వస్తే దర్శకుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అందుకే మిణుగురులు సినిమాను చూసిన దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు దర్శకుడు అయోధ్యకుమార్ను మెచ్చుకోవడమే కాదు సినిమా థియోటర్స్లో రిలీజ్ అయ్యేందుకు సహయపడ్డారు. ఆయన తీసుకున్న చొరవతో మిణుగురులు విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దర్శకుడిగా అయోధ్యకుమార్కి గొప్ప పేరొచ్చింది.

అయితే ఆయన కమర్షియల్ డైరెక్టర్ కాదు.. కమర్షియల్ సినిమా చేయలేడు అనే ముద్ర పడటంతో రెండవ సినిమా అవకాశం దక్కలేదు. దాంతో కుమారి 21 ఎఫ్ లాంటి సినిమా ప్రభావంతో 24 కిసెస్ అనే టైటిల్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టాడు. పక్కా స్టోరీ బోర్డ్ రెడీ గా ఉన్నా లో బడ్జెట్ అయినా, ఏ నిర్మాత దర్శకుడు అవకాశాలు ఇవ్వలేదు. 2015 – 16లోనే 24 కిసెస్ కథ రెడీ అయింది. కానీ ఈ సినిమా మొదలై రిలీజ్ కావడానికి దాదాపు మూడేళ్ళు పట్టింది. అయితే మిణుగురులు తీసిన దర్శకుడేనా ఇలాంటి చెత్త సినిమా తీసింది అనే నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కున్నాడు అయోధ్యకుమార్. దాంతో మళ్ళీ సినిమా రాలేదు. అయితే శేఖర్ కమ్ముల మాదిరిగా నెమ్మదిగా సినిమా చేసుకుంటూ వస్తే మాత్రం అయోధ్యకుమార్ చాలా గొప్ప దర్శకుడవడం మాత్రం గ్యారెంటీ అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తుంది.






























