విలక్షణ నటుడు మోహన్ బాబు 1975లో “స్వర్గం నరకం” చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 500 పైగా సినిమాలలో నటించారు. 70కి పైగా చిత్రాలను నిర్మించి, అనేక విజయాలను అందుకున్నారు. మోహన్ బాబు సినీ ప్రయాణంలో విజయాలతో పాటు 1992, 1993, 1994 సంవత్సరలలో కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఆ సంవత్సరాలలో మోహన్ బాబు హీరోగా నటించిన చిత్రాలు పరాజయాన్ని పొందాయి.

సీనియర్ వంశీ దాదాపు పాతిక చిత్రాలను నిర్మించిన గుర్తుండిపోయే చిత్రాలను నిర్మించారు. అలా విచిత్రంగా మోహన్ బాబుతో “డిటెక్టివ్ నారద” చిత్రాన్ని రూపొందించారు. 1992 సమీర్ ఎంటర్ప్రైజెస్, సీనియర్ వంశీ దర్శకత్వంలో “డిటెక్టివ్ నారద” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహిని హీరో, హీరోయిన్లుగా నటించారు. డిటెక్టివ్ పాత్రలో మోహన్ బాబు కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశారు. అయినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. అసెంబ్లీ రౌడీ చిత్రం తర్వాత దివ్యభారతితో రెండోసారి మోహన్ బాబు జతకట్టారు.

1992 శ్రీధర్ రెడ్డి నిర్మాణం, ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “చిట్టెమ్మ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు దివ్యభారతి హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పటి వరకు దివ్యభారతిని గ్లామర్ పాత్రల్లో చూసిన ప్రేక్షకులు ఒక్కసారి ఫ్యామిలీ పాత్రలో ఊహించుకోలేకపోయారు. ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి విజయాలను మోహన్ బాబు అందుకున్నప్పటికీ ఆయన దర్శకత్వంలో హీరోగా నటించిన “చిట్టెమ్మ మొగుడు” చిత్రం పరాజయం పొందింది.

1992 గోపి ఆర్ట్ పిక్చర్స్, చలసాని గోపి నిర్మాణం, కె.ఎస్.ప్రకాష్ దర్శకత్వంలో “దొంగా పోలీస్” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, మమతాకులకర్ణి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ బాబు ఈ సంవత్సరంలో నటించిన మిగతా చిత్రాలతో పోలిస్తే ఈచిత్రం పర్వాలేదనిపించింది. 1993 స్రవంతి మూవీస్, స్రవంతి రవికిషోర్ నిర్మాణం, ఏ మోహన్ గాంధీ దర్శకత్వంలో “రౌడీ మొగుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. మోహన్ గాంధీ, స్రవంతి రవి కిషోర్, మోహన్ బాబు ఈ అరుదైన కాంబినేషన్ లో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

1993 లక్ష్మీప్రసన్న పిక్చర్స్,దాసరి నారాయణరావు దర్శకత్వంలో “కుంతీపుత్రుడు” చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో మోహన్ బాబు, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘కుంతీ పుత్రుడు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

1994 రమణమూర్తి నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో “యమధర్మరాజు ఎమ్.ఎ”చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మోహన్ బాబు, రంభ, సురభి హీరో, హీరోయిన్లుగా నటించారు. అలనాటి నటి సుజాత మరో ప్రధాన పాత్రలో కనిపించారు. రాజ్ కోటి స్వరపరిచిన గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మోహన్ బాబు ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంలో కనిపించారు. పోలీసుగా రాజకీయ నాయకుడిగా రెండు పాత్రల్లో కనిపించిన ఆయన సినిమా విజయాన్ని గట్టెక్కించలేకపోయారు. ఇలా మోహన్ బాబు మూడు సంవత్సరాలు పరాజయాలతో చతికిల పడ్డారు.




























