కరోనాతో తల్లి మృతి …పాలిచ్చి మానవత్వాన్ని చాటుకున్న మహిళలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతో మంది పసిబిడ్డలకు తమ తల్లులను దూరం చేసింది. ఈ విధంగా వైరస్ బారినపడి ప్రసవ సమయంలో ఎంతోమంది తల్లులు మరణించడంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఈ తరుణంలోనే ప్రసవం కాగానే కరోనాతో తల్లి మరణించగా బిడ్డ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి ఎంతోమంది తల్లులు ముందుకు వచ్చి వారిలో ఉన్న అమ్మతనాన్ని చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

మహారాష్ట్ర,నాగపూర్‌లోని కింగ్స్‌వే ఆస్పత్రిలో మినాల్ వెర్నేకర్ అనే 32 ఏళ్ల గర్భిణీ ఇటీవల కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు.ఈ క్రమంలోనే అత్యవసర పరిస్థితులలో ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు.బిడ్డకు జన్మనివ్వగానే సదరు మహిళకు చాతిలో నొప్పి రావడంతో మరణించింది. నెలలు నిండకనే జన్మించిన బిడ్డకు ఫార్ములా మిల్క్ వల్ల అలర్జీ రావడంతో కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు.ఈ క్రమంలోనే ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల తల్లులు వారి చనుబాలను బాటిల్లో పిండిచ్చి ఆ బిడ్డకు పంపేవారు.

ఈ క్రమంలోనే ఆ బిడ్డ తండ్రి చేతన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నా భార్య ఏప్రిల్ 8న బిడ్డను కని చనిపోయింది. అయితే, నా బిడ్డకు కేవలం తల్లిపాలు మాత్రమే తాపించాలని వైద్యులు సూచించారు. ఈ విషయం తెలిసిన కొందరు మహిళలు తమ చనుపాలను నా బిడ్డ కోసం పంపించేవారు. వారు చూపిన మానవత్వం వల్లే ప్రస్తుతం నా బిడ్డ ఎంతో సురక్షితంగా ఉన్నాడని తెలిపారు”.

ఆస్పత్రి నుంచి ఆ బిడ్డను తీసుకుని థానేలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడు కూడా తన బిడ్డకు తల్లి చనుబాలు అవసరం ఏర్పడటంతో తన తండ్రి చేతన్”బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఇండియన్ ఉమెన్” అనే ఫేస్ బుక్ పేజీ ద్వారా తన సమస్య తెలిపాడు. ఈ విషయానికి స్పందించిన సమస్థ వ్యవస్థాపకురాలు అదునికా ప్రకాష్ ముందుకు వచ్చి ఇప్పటికీ ఆ బిడ్డకు వివిధ ప్రాంతాల నుంచి తల్లుల చనుబాలను అందజేస్తూ బాబు ప్రాణాలను కాపాడుతున్నారు.