కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేపట్టింది. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ పాన్ కార్డు సమర్పణకు సంబంధించిన పరిమితుల్లో పెద్ద మార్పులు చేసింది. ఈ మార్పులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇందులో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం విశేషం. ఇప్పటివరకు రూ.10 లక్షలు మించిన ఆస్తి లావాదేవీలకు పాన్ తప్పనిసరి కాగా, ఇప్పుడు ఆ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయం నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో భూములు, ఇళ్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి ఉపయోగపడనుంది. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ సడలింపు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇక మోటారు వాహనాల కొనుగోళ్లలో కూడా మార్పులు చేశారు. గతంలో వాహనం ధరతో సంబంధం లేకుండా పాన్ సమర్పించాల్సి ఉండేది. అయితే ఇకపై వాహనం ధర రూ.5 లక్షలు దాటితేనే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధన ద్విచక్ర వాహనాలకూ వర్తిస్తుంది.
బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కూడా కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకుపైగా నగదు జమ లేదా విత్డ్రా చేసినప్పుడు పాన్ వివరాలు సమర్పించడం తప్పనిసరి చేశారు. ఇది ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలకు చెల్లింపుల పరిమితిని కూడా పెంచారు. ఇప్పటివరకు రూ.50 వేలకుపైగా చెల్లింపులకు పాన్ అవసరముండగా, ఇప్పుడు ఆ పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. దీని వల్ల వినియోగదారులకు కొంత సౌలభ్యం లభించనుంది.
ఇన్సూరెన్స్ రంగంలో మాత్రం పాన్ వినియోగాన్ని మరింత కఠినతరం చేశారు. ఇకపై ప్రతి బీమా పాలసీ కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేశారు. దీని ద్వారా అక్రమ లావాదేవీలను నియంత్రించడమే లక్ష్యంగా ఉంది.
మొత్తంగా ఈ కొత్త నిబంధనలు ఒకవైపు సాధారణ లావాదేవీలను సులభతరం చేస్తూనే, మరోవైపు పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.




























