ఎస్.వి.కృష్ణారెడ్డి రాజేంద్రప్రసాద్ హీరోగా “కొబ్బరి బొండాం” చిత్రంతో దర్శకుడిగా సినీప్రయాణం మొదలుపెట్టారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్ హీరోగా మాయలోడు, రాజేంద్రుడు-గజేంద్రుడు లాంటి చిత్రాలనంతరం కృష్ణ హీరోగా ‘నెంబర్ వన్’ చిత్రాన్ని రూపొందించారు. ఆ తర్వాత మరొక కామెడీ చిత్రాన్ని రూపొందించాలని ముందుగా.. యమలీల సినిమాకి మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ లనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన ఆ హీరోలతో ప్రాజెక్టు ముందుకు పోలేదు.

సరిగ్గా అదే సమయంలో కామెడీ పాత్రలతో దూసుకెళుతున్న కమెడియన్ ఆలీని హీరోగా పెట్టి సినిమా రూపొందించాలనుకున్నారు. కానీ ఆయన ప్రక్కన హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందనే ఆలోచన లో భాగంగా..ముందుగా సౌందర్యను అనుకున్నప్పటికీ కొన్ని కారణాలతో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయింది. అలా ఈ సినిమాలో ఇంద్రజను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమాకి కొంత సోషియో ఫాంటసీ అంశాలు జోడించి, దానికి దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తనదైన కామెడీ టచ్ చేస్తూ సినిమా ఆద్యంతం నవ్వుల పువ్వులు పోయించాడు.

నవరస నటనా సార్వభౌమ సత్యనారాయణ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యమగోల చిత్రం నుంచి ఆయన యముడి పాత్రలో కనిపిస్తూనే ఉన్నారు. అలాంటిది ఈ సినిమాలో కూడా యముడిగా కనిపించారు. చిత్రగుప్తుడు అంటే అల్లురామలింగయ్య గుర్తుకు వస్తాడు. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం ఆ పాత్రను ధరించారు. చిత్రగుప్తుడు పాత్రలో బ్రహ్మానందం భూ లోకంలో విహరిస్తూ గోడ మీదకు ఎక్కి ఆవు ఎలా పేడ వేసిందని పిడకలను చూస్తూ ఆశ్చర్యంగా అడగడం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నగర పౌరులు చూస్తున్నారంటూ.. కనిపించిన కోట శ్రీనివాసరావు తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.

ఆ తరువాత ‘యమలీల’ చిత్రానికి ప్రాణం పోసే పాత్ర ‘తోటరాముడు’ పూర్తిగా తెలంగాణా స్లాంగ్ లో మాట్లాడుతూ కామెడీటచ్ తో గల విలనిజం పాత్రను తనికెళ్ల భరణి ఒక విధంగా చీల్చి చెండాడారని చెప్పవచ్చు. కోట శ్రీనివాస రావు ‘జయమ్ము నిశ్చయమ్మురా’ ‘గాయం’ లాంటి చిత్రాల్లో తెలంగాణా స్లాంగ్ తో అదరగొట్టినప్పటికీ ఎందుకో ఈ చిత్రంలో విలన్ గా తనికెళ్ల భరణిని తీసుకున్నారు. తనికెళ్ల భరణి “తోటరాముడు” పాత్రలో జీవించారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Tanikella Bharani : తనికెళ్ల భరణి ఓ కొత్తరకం విలనిజాన్ని చూపించారు

ఓ సన్నివేశంలో తనికెళ్ళ భరణి.. ఓ వారపత్రికలో కవిత రాసినందుకు పాఠకుల నుంచి అతనికి కొన్ని ఉత్తరాలు వస్తాయి. ఉత్తరాలను ఆలీచే చదివిస్తాడు. ఆ ఉత్తరాలు చదువుతూ “నాకొక బుల్లి చెల్లి.. నేడే గల్లీలో దానికి మళ్లీ పెళ్లేంట్రా… గాడిద, నికృష్టుడా, దరిద్రుడా, నీకు పిండం పెట్టా.. అని తిడుతూ తనికెళ్ళ భరణికి ఉత్తరాలు రాయడం ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తుంది. ఇలాంటి సీన్స్ లో తనికెళ్ల భరణి ఓ కొత్తరకం విలనిజాన్ని ఈ సినిమాలో చూపించారు. అలా తనికెళ్ల భరణి అన్నీ తానై ‘యమలీల’ చిత్రాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని విజయం వైపు పరుగులు తీయించారు. అలాగే మనీషా ఫిలింస్ కు కనక వర్షాన్ని కురిపించారు.




























