తమిళ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పునీత్ అభిమానులు.. కారణం అదేనా!

కోట్లాదిమంది అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు పునీత్ రాజ్ కుమార్. తమ అభిమాన హీరో చనిపోయాడన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శాండిల్ వుడ్ లో నెంబర్ వన్ హీరోగా పునీత్ రాజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. కేవలం అతని అభిమానులనే కాకుండా దక్షిణాది సినీ తారలను కూడా అతడి మరణవార్త కలచివేసింది.

పునీత్ రాజ్ కుమార్ తెలుగు సినిమాలలో నటించక పోయినప్పటికీ, తెలుగువాడు కాకపోయినప్పటికీ, మన వాడిలా భావించి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు అతడి మరణవార్త విని కన్నీటిపర్యంతమయ్యారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు అతడిని చూసేందుకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

పునీత్‌ను టాలీవుడ్ సొంత మనిషిలా భావించి అతడి మరణం పట్ల గొప్పగా స్పందించిన తీరును కన్నడిగులు కొనియాడుతున్నారు.ఇక అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇలాంటి స్పందన లేకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.తెలుగుతో సమానంగా తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడులవుతుంటాయి. పునీత్ తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.

అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం కూడా ఉంది. కానీ ఎవరు కూడా పునీత్ ని కడసారి చూడటానికి కూడా బెంగళూరుకు రాలేదు.దీంతో తెలుగు స్టార్లు పునీత్ కడసారి చూపుకి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.