ఇష్టం లేని పెళ్లి.. పోలీసుల రంగప్రవేశం.. చివరకు ఏం జరిగిందంటే..?

వారిద్దరు దగ్గరి బంధువులు. వరుసకు ఆమెకు అతడు మేనమామ అవుతాడు. అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వారిద్దరికి పెళ్లి నిశ్చయించారు. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు ఓ గంటలో పెళ్లి జరుగుతుందనగా ఓ వీడియో తీసి తన స్నేహితులకు పంపించింది. దీంతో పోలీసులు పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని ఆపు చేశారు. అసలెందుకు ఇలా జరిగింది.. ఎందుకు పోలీసులు పెళ్లిని క్యాన్సిల్ చేశారో తెలియాలంటే.. పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే…

తమిళనాడు రాజధాని చైన్నైలోని పుజల్ ప్రాంతానికి చెందిన జనతుల్లా ఫిర్డోసి అనే 22 ఏళ్ల మహిళకు తన మేనమామతో కుటుంబసభ్యులు బలవంతంగా ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆమెకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్లకు ఈ విషయం ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఆమె చేసేది లేక.. పెళ్లి పీటలపైనే ఓ వీడియో తీసుకుంది.

తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని.. తన మేనమామకు ఇదివరకే ఓ మహిళతో సంబంధం ఉందని.. ఈ పెళ్లి జరిగితే తాను ఆత్మహత్య చేసుకుంటానని తన వీడియోలో రికార్డు చేసి స్నేహితులకు పంపించింది. ఈ వీడియోను పోలీసులకు చేరవేయండంటూ వేడుకుంది. దీంతో ఆ వీడియో కాస్త పోలీసుల దాకా వెళ్లింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెళ్లి మండపం వద్దకు చేరుకున్నారు.

పెళ్లి ఆపేందుకు ఇరువురి కుటుంబసభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశారు. వాళ్లు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇరువురి కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. వధువు, వరుడు తరఫు బంధువులకు అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయవద్దని కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఏదైనా సమస్య ఎదరైతే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.