కోర్టు బోనులో స్రృహతప్పి పడిపోయిన మరోచరిత్ర హీరోయిన్
సరిత…. దక్షిణాది వెండితెరపై ఒకప్పుడు ఆమె అద్భుతనటీమణి, దానితో పాటు వినసొంపైన గాత్రంతో ఎందరో హీరోయిన్స్ కు గాత్రదానం చేసిన డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆమె అంత అందంగా ఉండకపోవచ్చు కానీ,ఎంతో ఆకర్షణీయమైన ముఖం ఆమెది.
ఆమె సినీకొలను లో విరిసిన నల్లకలువ అని అప్పట్లో చెప్పుకొనేవారు. తెలుగు, తమిళ్, మలమాళం తో పాటు కన్నడ లో కూడా లెక్కకు మించిన సినిమాలు చేసింది, ఎందరో తమిళ్, తెలుగు నటీమణులకు డబ్బింగ్ చెప్పింది. ఆమె సౌత్ స్ర్కీన్ పై దాదాపు 151 సినిమాల్లో నటించింది. అన్ని భాషాల్లోనూ కలుపుకొని ఆమె మొత్తం 7 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 9 ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు అందుకొంది. మహేష్ బాబు హీరోగా చేసిన అర్జున్ లో ఆమె పోషించిన ఆండాళ్లు అనే విలన్ పాత్ర ఆమెకు నంది స్పెషల్ జ్యూరి అవార్డు తెచ్చిపెట్టింది.
గుంటూరులో జన్మించిన ఈ తెలుగమ్మాయి, బాలచందర్ మరోచరిత్రతో తెలుగు తెరమీద ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే అప్పట్లో ఆమె సంచలనం సృష్టించింది. లెక్కకుమించిన సినిమాల్లో నటించినా, ఎన్నో అవార్డులు తెచ్చుకున్నా ఆమె వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. సరిత రెండు సార్లు పెళ్లిచేసుకుంది.
1975 లో తెలుగు రంగస్థలం నటుడు వెంకటసుబ్బయ్య ను పెళ్లిచేసుకుంది. పెళ్లై సంవత్సరం తిరగ్గానే అంటే 1976 లో ఆయన తో బంధం తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాత 1988 లో మలయాళ నటుడు ముఖేష్ ను పెళ్లిచేసుకుంది. వాళ్లకు శ్రావణ్ , తేజ అనే ఇద్దరు కొడుకులు . కొన్నాళ్ళకు వీరిద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తాయి. విడాకులు కోరుతూ ముఖేష్ చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వీరిద్దరికి 2007 లో విడాకులు మంజూరు చేసింది.
ఆ తర్వాత ముఖేష్ క్లాసికల్ డ్యాన్సరైన మెథిల్ దేవిక ను వివాహం చేసుకున్నారు. అయితే ఆ వివాహం చెల్లదని సరిత కొచ్చిలోని కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించారు. విడాకుల కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు తాను దుబాయిలో ఉన్నానని, కోర్టు ఇచ్చిన నోటీసులను తాను అందుకోలేదన్నారు. దీనితో తాను కోర్టుకు హాజరు కాలేకపోవడంతో కోర్టు విడాకులు మంజూరు చేసిందన్నారు.
కాబట్టి ముఖేష్ రెండో వివాహం చెల్లదంటూ తీర్పివ్వాలని కోర్టును సరిత అభ్యర్థించారు. విచారణ నిమిత్తం కోర్టుకు హజరైన సరిత కోర్టు హాలులోనే స్పృహ తప్పి పడిపోయారు. కోర్టుకు ముఖేష్ కూడా హాజరయ్యారు. ఈ కేసు ఇంకా ఎర్నాకుళం ఫ్యామిలీ కోర్టులోనే ఉంది. సరిత ప్రస్తుతం తన ఇద్దరి కొడకులతోనూ దుబాయ్ లో ఉంటోంది. ముఖేష్ తన కొత్త ఫ్యామిలీతో ఎర్నాకుళంలో ఉంటున్నాడు.