“పుణ్య భూమి నా దేశం నమో నమామి..ధన్యభూమి నాదేశం సదాస్మరామి.!! అనే పాట ప్రతి పౌరుని నరనరాన దేశభక్తి నింపుతుంది. చత్రపతి శివాజీ,క ట్ట బ్రాహ్మణ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో అన్నగారి పాత్రోచితమైన హావభావాలు ఆయన అభిమానులనే కాక ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

రాజకీయాలకు రావడంతో ఎన్టీ.రామారావు సినిమాలకు దూరమయ్యారు. కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర, అశోక సామ్రాట్ వంటి చిత్రాలతో తిరిగి మేకప్ చేసుకోవడం జరిగింది. ఎన్నికల్లో ఓటమితో మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడని ప్రతిపక్షాలు హేళన చేశాయి. అప్పుడు ఎన్టీ.రామారావు తాను సినిమాల్లో నటిస్తున్నది కేవలం బసవతారకం ట్రస్టు కోసమే తప్ప మరొక ఉద్దేశం కాదని పేపర్ ప్రకటన ఇస్తూ.. తాను ఇతర బ్యానర్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

ఒకరోజు “అశోక సామ్రాట్” సినిమా షూటింగ్ జరుగుతున్న రామకృష్ణ స్టూడియోస్ కి మోహన్ బాబు వెళ్లి ఎన్టీరామారావును కలిశారు. మీరు సినిమాల్లో నటిస్తానంటే నేను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ తో చెప్పాగా.. పెద్దాయన మేము నటించడానికి సిద్ధంగానే ఉన్నామని సెలవిచ్చారు.

మోహన్ బాబు పరుచూరి బ్రదర్స్ కి చెప్పి కథ సిద్ధం చేయించారు. సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ.. అవినీతి రాజకీయాలను వ్యతిరేకిస్తూ… రాసిన ఆ కథను ఎన్టీ.రామారావు గారికి చెప్పడంతో పెద్దాయన ఓకే చేశారు. దర్శకుడిగా రాఘవేంద్ర రావును, రమ్యకృష్ణ మీనాలను హీరోయిన్స్ గా తీసుకున్నారు. కానీ మీనా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో నగ్మాను సంప్రదించారు. ఎంపీగా జ్ఞానేశ్వర్ పాత్రలో బాలీవుడ్ నటుడు అమ్రిష్ పురి నటించారు. ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఆయన స్వరపరిచిన బాణీలు సినిమాకి ఎంతగానో ఉపయోగపడ్డాయి.

ఈ చిత్రాన్ని రామకృష్ణ, అన్నపూర్ణ, రామానాయుడు, ట్యాంకుబండ్, యూసఫ్ గూడా, వైజాగ్, అరకు, తలకోన, కాశ్మీర్, కొడైకెనాల్.. భారత సైనికులు ఉన్న ప్రాంతం చండీగఢ్ లో షూటింగ్ జరుపుకుంది. సినిమాకి దాదాపు మూడు కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఎన్టీ రామారావు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకున్నారు.

దాదాపు పది సంవత్సరాల తర్వాత తాము అనుకున్న పాత్రలో నందమూరి తారక రామారావు కనబడటంతో ఆయన అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఎన్టీ రామారావు తిరిగి రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఈ సినిమా ఎంతగానో దోహదపడిందని చెప్పవచ్చు. మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల ఫంక్షన్ ని మొదటగా హైదరాబాదులో జరపాలనుకున్నారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వలన తిరుపతిలో జరపగా అతిరథమహారధులు విచ్చేసి ఆ వేడుకను జయప్రదం చేశారు.

































