బ్యాంకింగ్ రంగంలో పారదర్శకత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న Reserve Bank of India త్వరలో కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా రుణాల మంజూరు, బాకీల వసూళ్ల విషయంలో బ్యాంకులు మరియు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన నియమాలను మరింత కఠినతరం చేయాలని ఆర్బీఐ భావిస్తోంది.

ఇటీవల జరిగిన తనిఖీల్లో కొన్ని ఆర్థిక సంస్థలు ఒక రుణం చెల్లించకుండానే అదే కస్టమర్కు మరో రుణం మంజూరు చేస్తున్నట్టు గుర్తించినట్లు సమాచారం. దీనివల్ల రుణాల అసలు స్థితి దాచిపెట్టబడే ప్రమాదం ఉందని ఆర్బీఐ అభిప్రాయపడుతోంది. అందుకే ఈ విధానాన్ని నియంత్రించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలని నిర్ణయించింది.
సాధారణంగా బ్యాంకులు లేదా Non‑Banking Financial Companiesలు కస్టమర్ క్రెడిట్ హిస్టరీ ఆధారంగా రుణాలు ఇస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో పాత రుణం బకాయి ఉన్నప్పటికీ కొత్త లోన్ మంజూరు చేస్తున్నట్లు పరిశీలనలో బయటపడింది. ముఖ్యంగా వాహన రుణం చెల్లించకపోయినా అదే సమయంలో గృహ రుణం లేదా ఇతర రుణాల పేరుతో మరో లోన్ ఇవ్వడం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ అంశంపై ఆర్బీఐ మూడు ఎన్బీఎఫ్సీ సంస్థలను ప్రశ్నించినట్లు సమాచారం. ఒక రుణం డీఫాల్ట్ అయినప్పటికీ మరో రుణం ఎందుకు మంజూరు చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సంస్థలు తమ అంతర్గత విధానాలను సవరించుకోవాలని సూచించింది.
ఆర్బీఐ స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే… పాత రుణం ఉన్న కస్టమర్కు కొత్త రుణం పూర్తిగా నిషేధం చేయడం లక్ష్యం కాదని. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు స్పష్టమైన విధానం ఉండాలని పేర్కొంది. సంస్థల బోర్డు ఆమోదించిన క్రెడిట్ పాలసీ ఆధారంగా మాత్రమే రుణాలు మంజూరు చేయాలని సూచించింది.
ఆర్థిక రంగంలో “ఎవర్గ్రీనింగ్” అనే పద్ధతి కూడా ఆర్బీఐ దృష్టికి వచ్చింది. అంటే పాత రుణం చెల్లించడానికి కొత్త రుణం ఇవ్వడం ద్వారా అసలు బాకీని దాచిపెట్టడం. దీనివల్ల కంపెనీల బ్యాలెన్స్ షీట్లో నిజమైన బకాయిల స్థితి బయటపడకుండా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈ విధానాన్ని నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు తీసుకురానుంది.
నిబంధనల ప్రకారం ఒక రుణం ఈఎంఐ చెల్లింపు 90 రోజులకుపైగా ఆలస్యమైతే అది నిరర్ధక ఆస్తిగా (NPA) పరిగణించబడుతుంది. మొదటి దశలో ఖాతాను SMA-0గా గుర్తిస్తారు. ఆలస్యం పెరిగే కొద్దీ SMA-1, SMA-2 వంటి వర్గాల్లోకి మారుతుంది. ఈ వ్యవస్థను మరింత కఠినంగా అమలు చేయాలని ఆర్బీఐ సూచిస్తోంది.
ఇకపై రుణగ్రహీతకు కొత్త లోన్ ఇవ్వాలంటే పాత రుణ స్థితి, చెల్లింపు సామర్థ్యం, లోన్ ఉపయోగం వంటి అంశాలను పూర్తిగా పరిశీలించాలని ఆర్థిక సంస్థలకు సూచనలు ఇవ్వనుంది. ముఖ్యంగా పెద్ద ఎన్బీఎఫ్సీ సంస్థలు తమ అంతర్గత రుణ విధానాల్లో ఈ మార్పులను తప్పనిసరిగా చేర్చాలని ఆర్బీఐ భావిస్తోంది.
విశేషంగా రూ.250 కోట్లకు పైగా నికర విలువ కలిగిన సంస్థలపై ఈ నిబంధనలు కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది. భారతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పని చేసే సంస్థలు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
ఈ మార్పుల ప్రధాన ఉద్దేశం బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, మొండి బకాయిలను దాచిపెట్టే పద్ధతులకు చెక్ పెట్టడం. అదే సమయంలో రుణాల చెల్లింపుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కూడా లక్ష్యంగా ఆర్బీఐ భావిస్తోంది.
కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే రుణాలు తీసుకునే వారికి మరింత బాధ్యత పెరుగుతుంది. ఒకసారి తీసుకున్న లోన్ చెల్లింపులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరో రుణం పొందడం కష్టమయ్యే అవకాశముంది. అందుకే ఆర్థిక నిపుణులు కూడా కస్టమర్లు తమ రుణాలను సమయానికి చెల్లించడం అత్యంత ముఖ్యం అని సూచిస్తున్నారు.





























