Analyst Damu Balaji : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ బుధవారం నాడు గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం. ఇక ఆయన లవ్ స్టోరీ గురించి ఆయన తండ్రి మాట్లాడారు, ఎంతో ఎమోషనల్ అయ్యారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

కులాంతర వివాహం చేసుకున్న సాయి చంద్…
సాయి చంద్ ఉస్మానియా యూనివర్సిటీ లో స్టూడెంట్ యూనియన్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నా పాటలతో ఉద్యమం స్ఫూర్తిని నింపాడు. అదే సమయములో ఆయన భార్య రజని నాట్యకారిణిగా తన నాట్యంతో ఉద్యమంలో భాగస్వామి కాగా వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక సాయి చంద్ ఎస్సి సామజిక వర్గానికి చెందిన వాడు కాగా రజని రెడ్డి కులానికి చెందిన యువతి కావడంతో రజని వాళ్ళు ఇంట్లో పెళ్ళికి అడ్డంకులు వచ్చాయి. సాయి చంద్ కు మొదటి నుండి తన ఇంట్లో ఎలాంటి సమస్య రాదనే నమ్మకం ఉంది. తన తండ్రి ఎన్నో కులాంతర వివాహలను చేసారు. అయితే సాయి చంద్ తండ్రి మాత్రం అగ్ర కుల అమ్మాయి అందునా భూస్వామి కూతురు ఒప్పుకోరేమో అని చెబితే రజని తన ఇంట్లో వాళ్లను ఒప్పిస్తాను ఒప్పుకోకపోతే నీకోసం వస్తానని చెప్పిందట.

కానీ సాయి చంద్ మాత్రం ఇంట్లో ఒప్పుకునే వరకు ఎదురుచూద్దామని చెప్పి ఐదేళ్ళు వారి ప్రేమకోసం ఎదురుచూశారు. అదే సమయంలో శ్రీకాంతచారి మరణం సమయంలో సాయి చంద్ పాడిన రాతి బొమ్మల్లో కొలువైన శివుడా పాటతో బాగా ఫేమస్ అయ్యారు. కెసిఆర్ తన సభల్లో రసమయి బాలకృష్ణ తో పాటు పాటలు పాడవలసిందిగా పిలిచారు. ఇక సాయి చంద్ ఆలా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకోవడంతో రజని ఇంట్లో కూడా వారి పెళ్ళికి అంగీకరించారు అంటూ బాలాజీ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న సాయి చంద్ కార్డియాక్ అరెస్ట్ అవ్వడంతో వెంటనే సీపీఆర్ చేయకపోవడం వల్ల మరణించి ఉండవచ్చు అంటూ చెప్పారు బాలాజీ.































