Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న సెల్ ఫోన్ అలాగే లెటర్ ను మాయం చేసిన పిఏ కృష్ణా రెడ్డి గారిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ తరువాత ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ హత్య గురించి అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి అల్లుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ల గురించి కీలక వాఖ్యలు చేసారు. ఆ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.

అతను చెప్పినందుకే అలా చేశాను…
అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడుతూ కృష్ణా రెడ్డి గారు హత్య ఎవరు చేసారు అనే విషయాలను మాట్లాడలేదు. తాను ఎవరి వైపు ఉన్నారని చెప్పలేదు. కానీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిబిఐ వారు తనను విచారించినపుడు బాగా కొట్టారని, వేళ్ళు వంగిపోయి ఇంకా నొప్పిగానే ఉన్నాయని, కోలుకోవడానికి ఏడాది పడుతుంది అంటూ చెప్పారు. ఈ విషయాలను కోర్టులో అవినాష్ రెడ్డి తరుపు లాయర్ గనుక ప్రస్థావిస్తే సిబిఐ ఇరుకులో పడుతుంది. ఇక సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చెబితేనే తాను ఫోన్ అలాగే లెటర్ దాచిపెట్టినట్లు పోలీసులకు చెప్పారు. ఈ విషయం రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. పోలీసులు వచ్చాక కూడా ఇవ్వకుండా దాచిపెట్టి కూతురు వచ్చాక ఆమెకే ఇచ్చారట కృష్ణా రెడ్డి.

ఇక వివేకానంద ఇంటికి ఉదయం ఐదు గంటలకే వెళ్లిన ఆయన తలుపు తీయలేదని ఆయన భార్య సౌభాగ్యమ్మ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆపైన చనిపోయారని తెలిసాక మొదట ఫోన్ రాజశేఖర్ రెడ్డి గారికే చేసారు, వివేకానంద తరువాత కృష్ణా రెడ్డి గారికి బాస్ రాజశేఖర్ రెడ్డి గారే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణా రెడ్డి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సునీత తన మీద కోప్పడినపుడు కూడా తానే మనకు సహాయం చేసేవాడు అతను మనకు వ్యతిరేకం అయితే కేసు మన మీదకే వస్తుంది అంటూ రాజాశేఖర్ రెడ్డి గారు అన్నారు అంటూ చెప్పడం ఇప్పుడు కీలకంగా ఉంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.





























