ఇటీవల మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ దుర్గం చెరువ కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్ నడుపుతూ బైక్ స్కిడ్ అయి ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు.. వైద్యులు బెలెటిన్ కూడా వెల్లడించారు.

ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. సాయి త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఈ ప్రమాదం గురించి ప్రముఖ నటుడు బాబు మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు స్పోర్ట్స్ నడుపుతూ ప్రమాదానికి గురై మరణించాడని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.
యాక్సిడెంట్లో తన కుమారుడి మరణాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. సరదా కోసం ప్రాణాలతో ఎవరు చెలగాటం ఆడొద్దని బాబుమోహన్ చెప్పుకొచ్చారు. ప్రమాదంలో మరణించిన వారు పోతారు కానీ.. వారిని ప్రేమించే వారు మాత్రం నిత్యం మానసిక క్షోభ అనుభవిస్తారు. ప్రతీ ఒక్కరూ దీనిని ఆలోచించుకోవాలి అని వాపోయారు.
కుమారుడు కోల్పోయిన బాధ ఒక తండ్రిగా తనకు తెలుసునని.. సాయి హెల్మెట్ పెట్టుకొని మంచి పని చేశాడని అన్నారు. ఎవరు బైక్ నడిపినా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించాడు. ఎవరూ ప్రమాదాన్ని కొని తెచ్చుకోరు.. కానీ దురదృష్టం వెంటాడితే ఎవరూ ఏమి చేయలేరన్నారు. అందుకే రోడ్డు మీదకు బైక్ తీసింది మొదలు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలంటూ.. సూచించారు.





























