జగిత్యాలలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి అంత్యక్రియల సమయంలోనే కుటుంబంలో ఆస్తి వివాదం భగ్గుమనడంతో శ్మశానవాటికలో ఉద్రిక్తత నెలకొంది. పక్షవాతంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన జంగిలి మల్లయ్య అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో ఆయన కూతుళ్లు, అల్లుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కరోనా సమయంలో మల్లయ్య ఏకైక కుమారుడు మరణించడంతో, మనుమడు మనోహర్ కుటుంబ వారసుడిగా ఉన్నాడు. సంప్రదాయాల ప్రకారం తలకొరివి పెట్టే హక్కు మనుమడికే ఇవ్వాలని బంధువులు సూచించినప్పటికీ, ఆస్తి హక్కులపై భయం కారణంగా కూతుళ్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అంత్యక్రియలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
వివాదం క్రమంగా ఘర్షణగా మారి, రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. శోకసమయంలో జరగాల్సిన అంతిమ వీడ్కోలు ఘట్టం రణరంగాన్ని తలపించడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంతసేపు శ్మశానవాటికలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
తరువాత మృతుడి మనుమడు మనోహర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఒకవైపు కన్నతండ్రికి చివరి వీడ్కోలు ఇవ్వాల్సిన వేళలోనే ఆస్తి వివాదం వెలుగుచూడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనతో కుటుంబ బంధాల కంటే ఆస్తి వివాదాలు పెరుగుతున్నాయనే ఆవేదన స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. శోక సమయంలోనూ సమన్వయం లేకపోవడం సమాజంలో విలువల సంక్షోభాన్ని చూపుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.





























