యెమెన్లో అరెస్టయి ఉరిశిక్ష విధించబడిన కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాస్తవానికి గురువారం ఆమెకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉండగా, అతి తక్కువ సమయంలో శిక్షను తాత్కాలికంగా వాయిదా వేయించారు. ప్రస్తుతం ఆమెకు కొంత ఊరట లభించినప్పటికీ, కేసులోని అసలు సమస్యలు ఇంకా పరిష్కారమైనవి కావు.

శుక్రవారం ఈ కేసు భారత సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనానికి నిమిష తల్లి తరపు న్యాయవాది వివరాలు సమర్పించారు. యెమెన్లో బ్లడ్మనీ చర్చల నిమిత్తం వెళ్లాల్సి ఉందని, అక్కడి మతగురువు కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చర్చల్లో భాగమయ్యారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఒక మిలియన్ డాలర్ల విలువైన రూ.8.6 కోట్లు బ్లడ్మనీగా చెల్లించేందుకు నిమిష కుటుంబం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
అయితే తలాల్ అదిబ్ మెహది అనే యెమెన్ యువకుడి హత్య కేసులో నిమిష ప్రియకు శిక్ష అనివార్యమని అతడి కుటుంబం స్పష్టం చేస్తోంది. డబ్బుతో ప్రాణాన్ని కొల్లగొట్టలేమని, న్యాయం జరిగేంత వరకు వెనక్కి తగ్గబోమని తలాల్ సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది చెప్పారు. నిమిష ప్రియను బాధితురాలిగా చూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వారు ఖండించారు.
కేరళ మతపెద్ద అబూబాకర్ ముస్లియార్ జోక్యం వల్లే తాత్కాలికంగా ఉరిశిక్షను వాయిదా వేశారు. ప్రస్తుతం ఆయన యెమెన్ హూతీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ చర్చలే నిమిష ప్రియ ప్రాణాల రక్షణకు కీలకమవుతాయని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విషయంపై స్పందించేలా ఆదేశించింది. నిమిష తల్లిదండ్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆ అభ్యర్థన ఆధారంగా కేంద్రం “మెరిట్ ఆధారంగా” నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ఆగస్ట్ 14కి వాయిదా వేసింది.
ఇక భారత విదేశీ వ్యవహారాల శాఖ కూడా యెమెన్ జైలు అధికారులు, ప్రాసిక్యూషన్ కార్యాలయాలతో సంప్రదింపులు కొనసాగిస్తోందని తెలిపింది. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్నామని వెల్లడించింది.
మొత్తానికి, నిమిష ప్రియకు తాత్కాలికంగా ఊరట లభించినప్పటికీ, ఆమె భవితవ్యంపై ఇంకా స్పష్టత లేదు. బ్లడ్మనీ చర్చలు ఫలిస్తాయా లేదా? బాధిత కుటుంబం క్షమా ధనం తీసుకునే అవకాశం ఉందా? అనే ప్రశ్నలతో ఈ కేసు చుట్టూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.





























