బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ షో తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ ఈ షో వివాదాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కొందరు బిగ్ బాస్ షో వల్ల మంచి పేరును సంపాదించుకుంటే మరి కొందరు మాత్రం ఈ షో వల్ల తమకు బ్యాడ్ ఇమేజ్ వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. తాజాగా ఈ షో గురించి తమిళనాడు సీఎం పళనిస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటినుంచి రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. తమిళనాడు సీఎం పళనిసామి బిగ్ బాస్ షో వల్ల పిల్లలు పాడవుతున్నారని కామెంట్లు చేశారు. బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్న కమల్ హాసన్ ఒక రాజకీయ పార్టీ లీడర్ కావడంతో పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో కొన్ని రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన వారిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. దీంతో కమల్ హాసన్ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ పార్టీపై విమర్శలు చేసిన నేపథ్యంలో పళనస్వామి కమల్ హాసన్ తో పాటు బిగ్ బాస్ షోపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
70 సంవత్సరాల వయస్సులో కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని.. ఈ షో వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. బిగ్ బాస్ షో వల్ల కుటుంబాలు బాగుపడవని.. బిగ్ బాస్ షో వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.






























