Paruchuri Gopalakrishna : పరుచూరి బ్రదర్స్ అనగానే రచయితలుగా వారు అందించిన సినిమాలు గుర్తు వస్తాయి. రచయితలుగానే కాకుండా డైలాగ్ రైటర్స్ గా, నటులుగా వారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తమదైన చెరగని ముద్ర వేసుకున్నారు. అనురాగ దేవత సినిమాతో మొదలైన వీరి సినీ ప్రస్థానం సైరా నరసింహారెడ్డి వరకు కొనసాగింది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలను అందించిన పరుచూరి బ్రదర్స్ మాస్ డైలాగులకు ఫేమస్. ప్రస్తుతం సినిమాలకు పెద్దగా పనిచేయడం లేదు వారు, అందులో పరుచూరి గోపాలకృష్ణ గారు మాత్రం యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఎంతో మంది సినిమా డైరెక్టర్స్ కావాలనుకుంటున్న వారికి గైడన్స్ ఇస్తుంటారు. ఇక పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్ లో వచ్చినవి కొన్ని సినిమాలైనా మంచి హిట్లందుకున్నాయి.

సురేష్ బాబు చెప్పిన మాట వినుంటే ఈరోజు వేరేలా ఉండేది…
పరుచూరి బ్రదర్స్ శోభన్ బాబు గారు నటించిన సర్పయాగం సినిమాను డైరెక్ట్ చేసారు. ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని సురేష్ బాబు గారిలాంటి వారు ముందే చెప్పేశారట. అంతకుముందు తీసిన ప్రజాస్వామ్యం సినిమా కూడా బాగా హిట్ అవడంతో పరుచూరి బ్రదర్స్ కి బాగా పేరు వచ్చింది. ఇక సర్పయాగం సినిమా అయ్యాక కూడా సినిమా డైరెక్షన్ చేయమని అశ్వినిదత్, రాఘవేంద్ర రావు, దేవి వర ప్రసాద్ ముగ్గురూ చాలా అమౌంట్ ఆఫర్ చేసి మరీ సినిమా చేయమని చెప్పారు. ఇక సురేష్ బాబు గారు అడ్వాన్స్ తీసుకోండి శంకరం పల్లి వద్ద నేను స్థలం తీసుకుంటున్నాను మీ డబ్బు ఇస్తే మీకు తల 50 ఎకరాలు చొప్పున 100 ఎకరాలు తీసుకోండి బిడ్డలకు భవిష్యత్ లో పనికొస్తుంది అని చెప్పారట.

అయితే పరుచూరి వెంకటేశ్వరరావు గారు నా తమ్ముడు డైరెక్టర్ అయితే నేనేం చేయాలి ఫిడేల్ వాయించాలా అని వ్యతిరేకించే సరికి మా అన్నకి ఇష్టం లేకుండా వద్దని వదిలేసాను. అలా ఆరోజు శంకర పల్లిలో 100 ఎకరాలు కొనుంటే మేము కోటీశ్వరులం అయ్యేవాళ్ళం. అపుడు ఆలోచనలు వేరు, రైటర్ గా ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంటుంది అనుకున్నాం, కొద్ది కాలానికి అన్నయ్య చాలా బాధపడ్డాడు. ఆరోజు నిన్ను డైరెక్టర్ అయ్యేందుకు ఒప్పుకునుంటే వేరేలా మన కెరీర్ ఉండేది అని బాధపడ్డారు అంటూ చెప్పారు.



























