ఉత్తరప్రదేశ్లో మరోసారి వరకట్న వేధింపుల దారుణం బయటపడింది. కాన్పూర్కు చెందిన ఓ వివాహిత తన అత్తింటి వారు తనపై చూపుతున్న అమానుష ఒత్తిడిని బయటపెట్టి పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త ఆరోగ్య సమస్యను దాచిపెట్టి పెళ్లి జరిపించారని, ఇప్పుడు చికిత్స పేరుతో డబ్బులు లేదా కిడ్నీ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది.

వివరాల్లోకి వెళితే, కాన్పూర్కు చెందిన యువతికి 2023 జూన్ 22న లక్నోకు చెందిన నిశాంత్ కుమార్తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు కుటుంబం నగదు, బంగారు ఆభరణాలు, కారుతో పాటు గణనీయమైన వరకట్నం ఇచ్చినట్లు సమాచారం. పెళ్లి అనంతరం భర్త ఆరోగ్యం విషయంలో అనుమానాలు కలిగిన భార్య, అతను తరచూ మందులు తీసుకుంటుండటాన్ని గమనించింది. దీనిపై అత్తింటివారిని ప్రశ్నించగా సాధారణ ఆరోగ్య సమస్యలే అని తప్పుదోవ పట్టించారు.
అయితే అనుమానం పెరగడంతో ఇంట్లో ఉన్న పత్రాలను పరిశీలించిన ఆమెకు షాకింగ్ నిజం తెలిసింది. భర్తకు ముందుగానే తీవ్రమైన కిడ్నీ సమస్య ఉన్నట్లు, అతను డయాలసిస్ చికిత్స పొందుతున్నాడనే విషయం బయటపడింది. ఈ విషయం పెళ్లికి ముందు పూర్తిగా దాచిపెట్టినట్లు బాధితురాలు చెబుతోంది.
ఈ విషయంపై ఆమె ప్రశ్నించగానే అత్తింటివారి వైఖరి మారిందని, అప్పటి నుంచి వేధింపులు పెరిగాయని పేర్కొంది. “నీ భర్త ప్రాణాలు కాపాడాలంటే మీ పుట్టింటి నుంచి రూ.30 లక్షలు తీసుకురా, లేదంటే నీ కిడ్నీ ఇవ్వాలి” అంటూ ఒత్తిడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు చెప్పింది.
ఇంతకుముందే తన భర్తకు మరో మహిళతో సంబంధం ఉన్న విషయం కూడా తనకు తెలిసిందని, ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో గత ఏడాది అక్టోబరులో అత్తింటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. తనకు చెందిన బంగారు ఆభరణాలు ఇంకా అత్తింటివారి వద్దే ఉన్నాయని కూడా ఆమె పేర్కొంది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు చాకేరి పోలీసులు భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులు, మోసం, క్రూరత్వం వంటి ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదని స్పష్టం చేశారు.
ఈ ఘటన మరోసారి వరకట్నం పేరుతో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను బయటపెడుతోంది. చట్టాలు ఉన్నా, ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సమాజం మొత్తం ఇలాంటి అన్యాయాలపై మరింత కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.




























