కాలంతోపాటుగా ప్రేక్షకుల అభిరుచులను అర్థం చేసుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ.. తెలుగు ప్రేక్షకులకు బొత్తిగా అలవాటు లేని కథ అందులో సైన్స్ ఫిక్షన్ ని సింగీతం శ్రీనివాసరావు బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం మామూలు విషయం కాదు. ఇది నిజంగా కత్తిమీద సాము లాంటిది. ఆదిత్య 369 సినిమా కంటే సంవత్సరం క్రితమే జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సోషియో ఫాంటసీ మూవీ విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

ఒకరోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సింగీతం శ్రీనివాసరావు విమాన ప్రయాణం చేస్తున్న సందర్భంలో సింగీతం గారు టైం మిషన్ కథని ఎస్పీ బాలు కి చెప్పడం జరిగింది. దానికి స్పందించిన ఎస్పీ బాలు చాలా బాగుందని చెప్పారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఎస్పీ బాలు నిర్మాత శివ లింగ కృష్ణ ప్రసాద్ కి టైమ్ మిషన్ కథ గురించి చెప్పడంతో ఆ ఇద్దరూ తిరిగి సింగీతం గారిని కలవడం జరిగింది.
అలా కథ డెవలపింగ్ విషయంలో టైమ్ మిషన్ గతంలో కి వెళ్లడం జరుగుతుంది అప్పుడు ఏ వంశ కాలపు రాజులను తీసుకోవాలని బాబరు, అక్బర్ చక్రవర్తులను గూర్చి సింగీతం ఆలోచించారు. ఆ క్రమంలో ఇంతకుముందు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కి పనిచేసిన జంధ్యాల గారిని సంప్రదించారు. అప్పుడు జంధ్యాల గారు బాలకృష్ణ గారికి శ్రీకృష్ణదేవరాయలు గెటప్పు బాగుంటుందని ఆ కాలాన్ని ఎంచుకోవడం బాగుంటుందని చెప్పడంతో ఆ విధంగా జంధ్యాలగారు ఈ సినిమాకి సంభాషణలు అందించారు.

ఈ సినిమాకి మొదటగా కెమెరామెన్ పీసీ.శ్రీరామ్ సినిమాలోని వర్తమానం లో వచ్చే దృశ్యాలను తీశారు. ఆ తర్వాత అనారోగ్య పరిస్థితుల వలన ఆయన తప్పుకోవడంతో వి.ఎస్.ఆర్ స్వామిని కెమెరామెన్ గా తీసుకొని సినిమాలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి దృశ్యాలను చిత్రీకరించారు. అప్పటికి ఆయన డేట్స్ అయిపోవడంతో కబీర్ లాల్ అనే మరొక కెమెరామెన్ ని తీసుకొని సినిమాలోని భవిష్యత్తులో వచ్చ దృశ్యాలను చిత్రీకరించారు. అలా ఈ సినిమాలో ముగ్గురు కెమెరామెన్ లు వర్క్ చేశారు.

ఆదిత్య 369 సినిమాలో డేట్స్ ఇబ్బంది ఉండకూడదని హీరోయిన్ పాత్రకి మోహిని ని తీసుకోవడం జరిగింది. ప్రొఫెసర్ గా టిను ఆనంద్, విలన్ గా అమ్రిష్ పురి, తెనాలి రామకృష్ణుడి గా చంద్రమోహన్ లు నటించగా సినిమాలో ప్రధానమైన కృష్ణకుమార్ పాత్ర కోసం కమలహాసన్ ని సంప్రదించగా ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఆఫర్ ని కమల్ హాసన్ వదులుకున్నారు. అలా ఎస్పీ బాలు సూచన మేరకు బాలకృష్ణ శ్రీ కృష్ణ దేవరాయలు, కృష్ణ కుమార్ గా ద్విపాత్రాభినయం చేశారు.

































