స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా పరిచయాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తాజాగా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువతులు అపరిచితులతో ఏర్పరుచుకునే ఆన్లైన్ సంబంధాలు అనేక సమస్యలకు దారితీస్తున్నాయని హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు చేశారు. ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలపై స్పందిస్తూ, సోషల్ మీడియాలో ఏర్పడే పరిచయాలు కొందరు యువతులను ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అపరిచితులు ఆకర్షణీయమైన ఫోటోలు, ఫేక్ ప్రొఫైల్స్ ఉపయోగించి యువతులతో పరిచయం పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ పరిచయాలను నమ్మి కొందరు తమ వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారని చెప్పారు. ఆ తర్వాత అదే విషయాలను అడ్డంగా పెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని వెల్లడించారు.
ముఖ్యంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగుతూ డబ్బులు వసూలు చేయడం, వ్యక్తిగతంగా కలవాలని ఒత్తిడి చేయడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరువు పోతుందనే భయంతో బాధితులు ఈ విషయాన్ని బయటపెట్టలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.
ఈ సమస్యలతో కొందరు యువతులు తీవ్ర నిర్ణయాలకు కూడా వెళ్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి భయం పడకూడదని, వెంటనే తల్లిదండ్రులు లేదా నమ్మకమైన వ్యక్తులకు చెప్పాలని సూచించారు. అవసరమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, బాధితులకు ఎల్లప్పుడూ పోలీసులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడుపుతూ, వారి ఆన్లైన్ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో ఫేక్ ప్రొఫైల్స్, వర్చువల్ నంబర్లు ఉపయోగించినా పోలీసుల నుంచి తప్పించుకోలేరని సైబర్ నేరగాళ్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత చాలా అవసరమని, అనుమానాస్పద వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు మరోసారి గుర్తుచేస్తున్నారు


























