Suthi Veerabhadra Rao : ‘హైదరాబాదు.. సికింద్రాబాదు.. ముషీరాబాదు..’ అంటూ చెప్పగానే సుత్తి వీరభద్రరావు గారి డైలాగు ప్రతి తెలుగు ప్రేక్షకుడికి గుర్తొస్తుంది. ‘అట్టు.. మినపట్టు.. పెసరట్టు..’ అంటూ సాగే డైలాగులు అందరినీ నవ్విస్తాయి. ఆయన చేసింది కొన్ని సినిమాలే అయినా కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 50 సినిమాలలో నటించిన వీరభద్ర రావు గారి అసలు పేరు మామిడిపల్లి వీరభద్ర రావు. ఆకాశవాణి రేడియో లో పని చేస్తూ సినిమాల్లోకి వచ్చిన వాళ్లలో వీరభద్ర రావు గారు కూడా ఒకరు.

చిన్న అలసత్వం ప్రాణాలను తీసింది…
తండ్రి చూపించిన ఉద్యోగం చేయకుండా వీరభద్ర రావు గారు అయన నచ్చిన పని చేయడం కోసం నటుడుగా అటు నాటకాలలో, ఉద్యోగరీత్య ఆకాశవాణిలో చేరారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో దాదాపు ఇరవై సంవత్సరాలు నాటక రంగంలో పనిచేసిన ఆయన 1980 లో సినిమా రంగం లోకి అడుగుపెట్టారు. మాదాల రంగారావు గారి స్నేహం వల్ల ‘బలిపీఠం’ సినిమాలో నటించారు. ఇక జంధ్యాల గారు మంచి మిత్రులు అవడం వల్ల ఆయన సినిమాల్లో నటించారు. ‘నాలుగు స్థంబలాట’ మంచి గుర్తింపు తీసుకురావడంతో వరుసగా మంత్రి గారి వియ్యంకుడు, అహ! నా పెళ్ళంటా, చూపులు కలిసిన శుభవేళ, మూడు ముళ్ళు, రెండుజెళ్ళ సీత, ఆనంద భైరవి, కాంచన గంగ, మెరుపు దాడి, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, స్వాతిముత్యం, చంటబ్బాయి, శాంతినివాసం వంటి దాదాపు 50 సినిమాల్లో నటించారు. ఇక జంధ్యాల గారి చూపులు కలిసిన శుభవేళ ఆయన చివరి చిత్రం.

1988 లో ‘చూపులు కలిసిన శుభవేళ’ సినిమా చిత్రీకరణ లో భాగంగా హైదరాబాద్ లో సాంగ్ షూటింగులో కాలు బెణికితే, అప్పటికే మధుమేహం ఉన్న వీరభద్ర రావు గారు వైద్యులు చికిత్స, విశ్రాంతి అవసరం అని చెబితే సినిమా షూటింగ్ పూర్తయ్యాక చెన్నై కి వెళ్లి చికిత్స పొందారు. అయితే రాత్రి నిద్రపోడానికి ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల అది వికటించి ఆయన గుండె పోటు తో మరణించారు. మొదటే విశ్రాంతి తీసుకుని సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఆయన బ్రతికిఉండేవారేమో…



























