Taj Mahal in danger : యెడాపెడా కురుస్తున్న వానలకు చిగురుటాకులా వణుకుతోంది ఉత్తర భారతం. యమున గంగ నదులు ఉగ్రరూపం దాల్చి పరవళ్ళు తొక్కుతూ నగరాలను ముంచెత్తుతున్నాయి. ఇల్లు, పొలాలు, బ్రిడ్జ్లు అంటూ అన్నింటినీ తనలో కలుపుకుంటూ సముద్రం వైపు పరవళ్లు తొక్కుతున్న నదుల భీకర పరుగుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. ఒకవైపు గుజరాత్ మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ ఇటు కాశ్మీర్, ఎక్కడా వరణుడు ఏ మాత్రం జాలి చూపించకుండా దంచికొడుతున్నాడు. వరదలకు ఇప్పటికే ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగితుంటే ఇపుడు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రమాదంలో ఉంది.

45 ఏళ్లకు మళ్ళీ యమునకు వరద…
హోరెత్తుతున్న వానలకు గుజరాత్ లోని పలు జిల్లాలు ముంపుకు గురవతుంటే మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యమునా నది మహోగ్ర రూపం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్ మహల్ గోడలను వరద తాకింది. తాజ్మహల్ గార్డెన్లో భారీగా వరదనీరు నిలిచింది. తాజ్ మహల్ యమున నది ఒడ్డున ఉన్న విషయం తెలిసిందే.

1978 లో అధిక వరదలు వచ్చిన సమయంలో తాజ్ మహాల్ కి వరద నీరు చేరింది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమున నది ప్రవహించడంతో తాజ్ మహల్ బేస్ మెంట్ లో 22 గదుల్లోకి నీరు చేరింది. మళ్ళీ ఇపుడు అలాంటి వరద యమున నదికి రావడంతో ఇప్పటికి అంతటి తీవ్రత లేకపోయినా తాజ్ మహల్ గోడలను యమున నది నీరు తాకింది. అయితే ఇప్పటికి వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియాలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకటించింది.