Vakkantham Vamsi : తెలుగు సినీ అభిమానులకు రచయితగా, దర్శకుడిగా వక్కంతం వంశీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఈటీవీలో మొదట వ్యాఖ్యతగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన వంశీ 1996లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో హీరోగా నటించాడు. తరువాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించాడు. ఇక ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అశోక్’ సినిమాతో మొదటిసారి రచయితగా చేసాడు. తరువాత వచ్చిన ‘కిక్’ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాకు కథను అందించడమే కాకుండా దర్శకత్వం వహించారు. తన సినిమాల గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన పంచుకున్నారు.

నా సినిమా కథలని కాపీ కొట్టాను అన్నారు…
వక్కంతం వంశీ చాలా సినిమాలకు కథలు అందించినా, చాలా దర్శకుల దగ్గర చేసినప్పటికీ ఎక్కువగా సురేందర్ రెడ్డి సినిమాలకు కథలను అందించడం విశేషం. వక్కంతం వంశీ మొదట్లో తన కథల మీద చాలా విమర్శలు వచ్చేవని, ఇంగ్లీష్ సినిమా కథలను పోలి ఉంటాయని అనేవారని, మొదట్లో అది కొంచం బాధించినా తరువాత వదిలేశానని ఆయన చెప్పారు. ఇక కిక్ సినిమా కథను జెంటిల్ మాన్, ధూమ్ సినిమా కథలను పోలి ఉందని కూడా అన్నారు. ఎవడు సినిమా కూడా ఇంగ్లీష్ సినిమా కథను కాపీ కొట్టానని అన్నారు.

నేను ఏ కథనూ కాపీ కొట్టలేదు, ఇప్పుడు నేను కొత్తగా చెప్పి నిరూపించలేను. ధూమ్ సినిమాను చూసి జెంటిల్ మాన్ సినిమా అనికూడా అనుకోవచ్చు. కొత్తగా కథలను ఎవరూ సృష్టించలేరు కదా, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఉన్నవే మనం ఊహించగలం అని చెప్పుకొచ్చారు. ఇక రేసు గుర్రం సినిమా గురించి మాట్లాడుతూ అది అసలు కొత్త కథ కాదు, నేనేదో అద్భుతం ఊహించి రాసినది కాదు, మనందరికీ తెలిసిన అన్నదమ్ముల కథ. కానీ ఆ కథను నేను చెప్పిన విధానం కొత్తగా ఉంది అంతే అని చెప్పుకొచ్చారు.



























