మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందగా, ఆమె భర్తకు ఈ విషయం చాలా ఆలస్యంగా తెలిసింది. ఈ ఘటన రాజస్థాన్కు చెందిన అదనపు జడ్జి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.

వివరాల ప్రకారం, రాజస్థాన్కు చెందిన అదనపు జడ్జి రాజ్కుమార్ చౌహాన్ తన భార్య ఉషతో కలిసి కాచిగూడ–భగత్ కీ కోటి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలో ఇద్దరికీ వేర్వేరు బెర్తులు రావడంతో, వారు ఒకే బోగీలో ఉన్నప్పటికీ వేర్వేరుగా కూర్చున్నారు. ప్రయాణం మధ్యలో ఇద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ వెళ్లారని తెలిసింది.
వారు దిగాల్సిన నింబాహెర స్టేషన్ చేరుకునే సమయానికి, ఉష వాష్రూమ్కి వెళ్లి వస్తానని భర్తకు చెప్పి వెళ్లింది. ఆ సమయంలో రాజ్కుమార్ తన సామాన్లను తీసుకొని దిగేందుకు సిద్ధమయ్యారు. ట్రైన్ ఆగిన వెంటనే ఆయన ప్లాట్ఫామ్పైకి దిగిపోయారు. భార్య కూడా తనకంటే ముందే దిగిపోయి ఉంటుందని భావించి ప్లాట్ఫామ్పై ఎదురుచూశారు.
అయితే ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరిపోయినా ఉష కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన రాజ్కుమార్ స్టేషన్ అంతా వెతికినా ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఆమె ట్రైన్ నుంచి దిగలేదని స్పష్టమైంది.
దీంతో వెంటనే తదుపరి స్టేషన్లకు సమాచారం పంపించారు. దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న జవోర స్టేషన్కు ట్రైన్ చేరుకున్న తర్వాత, రైల్వే పోలీసులు సంబంధిత బోగీలో తనిఖీలు ప్రారంభించారు. ఆ సమయంలో ఒక వాష్రూమ్ తలుపు లోపల నుంచి లాక్ అయి ఉండటం అనుమానం కలిగించింది.
పోలీసులు తలుపు బలవంతంగా తెరిచి చూడగా, అక్కడ ఉష అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించింది. వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించిన తర్వాత గుండెపోటు కారణంగా ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ వార్త భర్త రాజ్కుమార్కు తెలియగానే ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. క్షణాల్లో జరిగిన ఈ విషాదం కుటుంబ సభ్యులను, పరిచయస్తులను షాక్కు గురిచేసింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు.




























