అమెరికాలో గత నెల మేలో మరణించిన కరోనా బాధితుల్లో 99.2 శాతం మంది వ్యాక్సిన్లు పొందని వారేనని తాజా నివేదిక సూచిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డేటాను విశ్లేషించినప్పుడు ఇది వెల్లడైంది.

మే నెలలో అమెరికాలో 18వేలకు పైగా కొవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయని, అందులో పూర్తి స్థాయిలో టీకా పొందినివారు 150 మంది మాత్రమే ఉన్నారని సదరు నివేదిక పేర్కొంది. బాధితులు ఆసుపత్రిపాలు కాకుండా చూడటంలోనూ వ్యాక్సిన్లు ఉపయోగ పడ్డాయని తెలిపింది. గత నెలలో 8,53,000 మంది కరోనాతో ఆసుపత్రుల్లో చేరగా.. వారిలో 1200 మంది మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు పొందినవారు ఉన్నారని వివరించింది.































