సినీ పరిశ్రమది ఒక విచిత్రమైన పరిస్థితి ఎప్పుడు ఏ సినిమా విజయవంతం అవుతుందో ఎప్పుడు పరాజయం పొందుతుందో ఎవరు ఊహించలేము. జయాపజయాలు కాలాతీతం. ఊహించిన చిత్రాలు ఫెయిల్ అవ్వడం ఊహకందని చిత్రాలు విజయవంతం అవడం ఒక్కోసారి సినిమా రంగంలో కూడా జరుగుతూనే ఉంటుంది. ఈ పరిస్థితికి ఎవరూ అతీతులు కాదు.

అలా నాగార్జున కూడా 1990 సంవత్సరంలో తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కోలేక తప్పలేదు. ఈ సంవత్సరంలో నాగార్జునకు తప్ప స్టార్ హీరోలందరికీ హిట్స్ పడ్డాయి. చిరంజీవికి జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ, కొదమసింహం, బాలకృష్ణకు లారీ డ్రైవర్, నారి నారి నడుమ మురారి, వెంకటేష్ కి బొబ్బిలి రాజా. 1989 అన్నపూర్ణ బ్యానర్, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన “శివ” చిత్రం అఖండ విజయం సాధించింది. తర్వాత 1990లో నేటి సిద్ధార్థ, ప్రేమ యుద్ధం, ఇద్దరూ ఇద్దరే చిత్రాలు విడుదలయ్యాయి.

అనుపమ ఆర్ట్స్, రాజేంద్ర సింగ్ దర్శకత్వంలో లో వచ్చిన ప్రేమ యుద్ధం చిత్రంలో నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా నటించారు. హంసలేఖ సంగీత దర్శకత్వంలో సినిమాలోని “స్వాతి ముత్యపు జల్లులలో” అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. పూర్తిగా ప్రేమ కథ చిత్రం అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను కనబరిచింది.

ఆ తర్వాత క్రాంతి చిత్ర బ్యానర్, క్రాంతి కుమార్ దర్శకత్వంలో విడుదలైన ‘నేటి సిద్ధార్థ’ సినిమాలో నాగార్జున, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. నాగార్జున, శోభన ఒకప్పటి జంట మళ్లీ పునరావృతం అయినప్పటికీ సినిమా అనుకున్నంత విజయం బాక్సాఫీస్ వద్ద సాధించలేకపోయింది.

ఆ తరువాత అన్నపూర్ణ బ్యానర్ లో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన “ఇద్దరు ఇద్దరే” చిత్రం లో నాగార్జున, రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించారు. తండ్రి, కొడుకులు నటించిన “కలెక్టర్ గారి అబ్బాయి” చిత్రం గతంలో విజయవంతమైనప్పటికీ, అదే కలయికలో వచ్చిన “ఇద్దరు ఇద్దరే” చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఒక విధంగా చెప్పాలంటే 1989లో విడుదలైన శివ చిత్రం అఖండ విజయం అనంతరం.. 1990 సంవత్సరంలో వచ్చిన ఈ మూడు చిత్రాలు పూర్తిగా పరాజయం పొంది, అభిమానులను పూర్తిగా నిరాశ పరచాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


































