సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ అనగానే అభిమానుల్లో ఒక రకమైన ఆనందం మొదలవుతుంది. అది ఓ హీరో-దర్శకుడు లేదా ఒక హీరో-ఒక హీరోయిన్ ఇలా కొన్ని కాంబినేషన్స్ అనగానే అవి తప్పనిసరిగా బ్లాక్ బస్టర్ అవుతాయని ముందుగానే ఆడియన్స్ ఊహించుకుంటారు. అలా 1990 తర్వాత అత్యంత భారీ జంటగా చెప్పుకునే చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందంటే నిజంగా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్లో మోసగాడు, రాణికాసుల రంగమ్మ, జగదేకవీరుడు అతిలోకసుందరి ఆ తర్వాత ఎస్పి పరశురాం వంటి చిత్రాలు విడుదలయ్యాయి.

ఎస్పీ పరశురామ్ మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ విజయవంతమయ్యాయి. ఇక 1990లో వచ్చిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” సినిమా ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. హీరోగా చిరంజీవికి, హీరోయిన్ గా శ్రీదేవికి, దర్శకుడిగా రాఘవేంద్రరావుకి ఈ సినిమా ఎంతో పేరు తీసుకు వచ్చింది. ఇందులోని అన్ని పాటలు ఆల్ టైమ్ సూపర్ హిట్ గా నిలిచాయి. అలా ఆ సినిమా అనంతరం ఖరీదైన జంటపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగాయి. 1994లో చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్లో సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ జరగగానే అభిమానుల్లో కోలాహలం మొదలైంది. గీతాఆర్ట్స్ బ్యానర్, రవిరాజా పినిశెట్టి దర్శకత్వం చిరంజీవి, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా ‘ఎస్పి పరశురాం’ చిత్రం1994 జూన్ 15 న విడుదల అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం చేరుకోలేకపోయింది. అత్యంత పరాజయం పొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించలేక చతికిలపడింది.

1988లో రవిరాజాపినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన “యముడికి మొగుడు” చిత్రం ఇండస్ట్రీహిట్ గా నిలిచిపోయింది. అలా చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి రవిరాజాపినిశెట్టి చిత్రం అనగానే మరో ఇండస్ట్రీహిట్ అని అందరూ అనుకున్నప్పటికీ “ఎస్పీ పరశురాం” చిత్రం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. కారణాలను తరచి చూస్తే.. చిరంజీవికి గతంలో కూడా పోలీస్ పాత్రలు అంతగా అచ్చీరాలెదనే చెప్పాలి. అయినప్పటికీ మళ్లీ అలాంటి పాత్రలో చిరంజీవి కనిపించారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత శ్రీదేవిని ఒక దేవకన్యలా ప్రేక్షకులు భావించారు.

కానీ ఆ తర్వాత వచ్చిన క్షణక్షణం, గోవింద గోవింద, ఎస్పీ పరశురాం చిత్రాలలో శ్రీదేవిని సాదాసీదాగా ప్రేక్షకులు ఊహించుకో లేకపోయారు. ఇక సినిమాకి సంగీతం అత్యంత ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎస్పీ పరశురామ్ చిత్రంలో ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ఏ ఒక్క పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడం లాంటివి సినిమాను బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టించాయి.



























