K Viswanath : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కే.విశ్వనాథ్ గురువారం రాత్రి అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. కాశీనాధుని విశ్వనాధ్ గారు తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ప్రత్యేక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన గొప్ప వ్యక్తి, కె.విశ్వనాథ్ గారు. ఆయన లేని లోటు తీరనిది. గుంటూరు జిల్లా రేపల్లెలో 1930, ఫిబ్రవరి 19న జన్మించిన కె.విశ్వనాథ్. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.

1965లో ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో దర్శకుడిగా విశ్వనాథ్ అరంగేట్రం చేసారు కె.విశ్వనాథ్. సాగరసంగమం, శంకరాభరణం, స్వర్ణ కమలం, శుభసంకల్పం వంటి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే మరపురాని చిత్రాలుగా నిలిచాయి. అయితే ‘శంకరాభరణం’ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తయిన రోజునే విశ్వనాథ్ మరణించడం యాదృశ్చికం.



































