దక్షిణాది సినీ పరిశ్రమలో మలయాళ పరిశ్రమకి ఒక ప్రత్యేకత ఉంది.టాలీవుడ్,కోలీవుడ్,శాండల్ వుడ్ తో పోల్చిచూస్తే మాలీవుడ్ (మలయాళం) చిన్న పరిశ్రమ అయినప్పటికీ ఎన్నో కథలను దక్షిణాది సినీపరిశ్రమకే కాకుండా ఉత్తరాది సినీపరిశ్రమకు కూడా అందించడం జరిగింది. అక్కడి టాప్ స్టార్స్ మోహన్ లాల్, జయరామ్, దిలీప్, సురేష్ గోపి కంటే ముందు వరుసలో మమ్ముట్టి పేరు చెప్పవచ్చు. మమ్ముట్టి కేరళలోని చండిరూర్ లో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు ఇస్మాయిల్, ఫాతిమా.

సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత మమ్ముట్టి అనే పేరు స్క్రీన్ నేమ్ పెట్టుకున్నారు. కానీ ఈయన అసలు పేరు మహమ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. 1980 లో మాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మమ్ముట్టి అనతికాలంలోనే మలయాళం తమిళ, కన్నడ, తెలుగు, హిందీ భాషలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1990 లో మౌనం సమాధామ్ అనే తమిళ చిత్రం, 1992 స్వాతి కిరణం అనే తెలుగు చిత్రం, 1993 ధర్తిపుత్ర్ అనే హిందీ చిత్రం, షికారి అనే కన్నడ చిత్రాల్లో మొదటగా మమ్ముట్టి నటించారు. దాదాపు అన్ని భాషల్లో కలిపి 400 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. మమ్ముట్టి నటనకు గాను 13 ఫిలింఫేర్ అవార్డ్స్, 7 స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అనే బిరుదుతో సత్కరించింది.

ఆ తర్వాత 1997లో ఉమామహేశ్వర రావు దర్శకత్వంలో వచ్చిన సూర్యపుత్రులు చిత్రంలో మమ్ముట్టి, సుమన్, నగ్మా, శోభన, మాలాశ్రీ హీరో, హీరోయిన్లుగా ఆ తరువాత వచ్చిన రైల్వే కూలి చిత్రంలో మమ్ముట్టి హీరోగా నటించారు. తిరిగి చాలా కాలం గ్యాప్ తర్వాత 2019లో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని మహి రాఘవ రాసుకున్న కథతో మమ్ముట్టి హీరోగా “యాత్ర” అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా విజయవంతం కావడంతో మమ్ముట్టికి మంచి పేరు వచ్చింది.

అయితే 2008 లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో విలన్ వేషానికి అల్లు అరవింద్ మమ్ముట్టిని సంప్రదించగా.. ఈ పాత్రకు మీరు చిరంజీవిని అడగగలరా.. అని మమ్ముటి అనడంతో అల్లుఅరవింద్ ఆయనను అడగలేమని సమాధానం చెప్పారు. అలా ఆ సినిమాలో నటించడానికి మమ్ముట్టి నిరాకరించారు. ఆ తర్వాత జల్సా సినిమాలో విలన్ గా ముఖేష్ రుషి నటించారు. చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఓ సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నారు.































