నేటి కాలంలో దాహాన్ని తీర్చుకునేందుకు గుక్కెడు నీళ్లు తాగాలన్నా భయపడే పరిస్థితులొచ్చాయి. తమ నీళ్లు అత్యంత సురక్షితమైనవని భారీగా ప్రకటనలు గుప్పించే కంపెనీల నీళ్ల బాటిళ్లలో భారీగా సూక్ష్మస్థాయి ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

చైనా, అమెరికా, భారత్,ఇండోనేసియా, బ్రెజిల్, కెన్యా సహా 9 దేశాల్లో న్యూయార్క్ స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ షాకింగ్ విషయం తేలింది. ఈ 9 దేశాల్లో ప్రజాదరణ పొందిన 11 బ్రాండ్లకు చెందిన 259 ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వారు పరీక్షించారు. ఈ నీళ్ల బాటిళ్లలో సగటున ఒక్కోదానిలో 325 ప్లాస్టిక్ అవశేషాలు, గరిష్టంగా ఓ బాటిల్లో పది వేల ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వారి పరిశోధనలో గుర్తించారు.

వారు పరీక్షించిన 259 బాటిళ్లలో 90 శాతం వాటిలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయనీ, 17 బాటిళ్లలో ప్లాస్టిక్ రేణువులు లేవని తేల్చారు. జర్నలిజం ప్రాజెక్ట్ ఆర్బ్ మీడియా సూచన మేరకు తాము ఈ పరిశోధన చేశామన్నారు. కుళాయి నీళ్లతో పోల్చుకుంటే ఈ వాటర్ బాటిళ్లలో ప్లాస్టిక్ అవశేషాలు రెండింతలు అధికంగా ఉన్నాయని.. దీంతో మంచినీళ్లలో ప్లాస్టిక్ వల్ల కలిగే ముప్పును సమీక్షిస్తామని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)..




























