పార్వతీపురం మన్యం జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో వెచ్చదనం కోసం ఇంట్లో పెట్టిన నిప్పుల కుంపటి ఒకే కుటుంబాన్ని కబళించింది. ఈ ప్రమాదంలో దంపతులు సహా వారి కుమారుడు మృతి చెందగా, చిన్న కుమార్తె తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ప్రాథమికంగా కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమైనప్పటికీ, పోలీసుల విచారణలో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన విషాద ఘటనగా తేలింది. ఇంట్లో తలుపులు మూసి నిప్పుల కుంపటి పెట్టడంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే… వనజ గ్రామానికి చెందిన మీనక మధు (35), సత్యవతి (30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో చదువుకుంటుండగా, రెండో కుమార్తె మోక్ష తాతగారి ఊరు జియ్యమ్మవలస మండలం బొమ్మికలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. మిగిలిన ఇద్దరు చిన్నారులు అయేషా (6), మోస్య (4) తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు.
గురువారం రాత్రి మధు, సత్యవతి, అయేషా, మోస్య ఎప్పటిలాగే ఇంట్లో నిద్రపోయారు. అయితే శుక్రవారం ఉదయం ఎంతకీ తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారు, బంధువులకు అనుమానం వచ్చింది. తలుపులు తెరిచి చూడగా నలుగురు కదలిక లేకుండా పడి ఉండటం గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
చినమేరంగి సామాజిక ఆసుపత్రికి తీసుకెళ్లగా మధు, సత్యవతి, మోస్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయేషాను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంకు రిఫర్ చేశారు.
ఈ ఘటనపై రాంబాబు, తిరుపతిరావు మాట్లాడుతూ… అప్పుల భారం కారణంగా ఆత్మహత్యగా భావించినా, ఇంట్లో వెచ్చదనం కోసం పెట్టిన నిప్పుల కుంపటి వల్ల కార్బన్ మోనాక్సైడ్ వెలువడి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.





























