Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాట బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో హీరోగా నటించిన హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీకి కేఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ రాజకీయాల వైపు వచ్చి గరుడ పురాణం అంటూ ఆ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. తాజగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ లోని ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

నేను ఎవరి పార్టీలోనూ లేను ఎవరికీ బినామీ కాదు…
బీజేపీ లో చేరి ఆ తరువాత ఆ పార్టీ నుండి బయటికి వచ్చిన శివాజీ ప్రస్తుతం ఏ పార్టీ లోనూ లేనట్టు స్పష్టం చేసారు. నేను న్యూట్రల్ గా ఉన్నాను అంటూ చెప్పిన శివాజీ రాజకీయ నాయకులందరూ మారరు, జనాలు డబ్బు తీసుకుని ఓటు వేయడం మానేస్తేనే అభివృద్ధి మొదలవుతుందంటూ చెప్పారు. ఇక ఒక్కో నాయకుడి మూడు మంచి పనులు, విధ్వంసాల గురించి మాట్లాడుతూ మోడీ చేసిన మంచి పని ఒక్కటీ లేదని విధ్వంసాలు మాత్రం చెబితే సమయం అయిపోతుందని తెలిపారు. ఇక చంద్రబాబు చేసిన మంచి పనులు హైదరాబాద్ అభివృద్ధి ఇప్పటికీ ఆ ఫలాలనే తెలంగాణ అనుభవిస్తోందని చెప్పారు. ఇక విధ్వంసాలు ఆయన ప్రత్యేక హోదా మీద యూ టర్న్ తీసుకోవడం, ఎమ్మెల్యేలను గుడ్డిగా నమ్మడం, రాజకీయాలు చేసేందుకు రాకపోవడం ఆయన చేసిన తప్పులు అంటూ చెప్పారు.

ఇక జగన్ గురించి చెబుతూ జగన్ తనకు కావాల్సిన దాన్ని ఎలాగైనా సాధించుకుంటాడు. తన అనే వాళ్ల కోసం చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళడానికైనా వెనుకాడడు అంటూ చెప్పారు. ఇక జగన్ విధ్వంసాల గురించి మాట్లాడుతూ ఆయనకు పరిపాలన రాదు, సమర్థత ఉంటే ప్రతిపక్షంను తొక్కేయాలని అనుకోడు అంటూ చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే వాటిని సమర్థంగా ఎదుర్కోవడం నేర్చుకున్నారు. ఇక విధ్వంసాల గురించి మాట్లాడటానికి ఆయన పరిపాలన చేయలేదు కాబట్టి చెప్పలేము. ఇక పవన్ రాజకీయాల మీద పూర్తిగా ఫోకస్ చేసి సినిమాలను పక్కన పెట్టి జనాల్లో తిరిగితేనే ఆయన పార్టీ పటిష్టం అవుతుంది. ఆయన తరువాత ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడం మైనస్ అంటూ చెప్పారు. ఇక వాలంటీర్ వ్యవస్థ మీద పవన్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అని ఒకప్పుడు జన్మభూమి కమిటీలు ఎలా వ్యర్థమో అలాగే ఇపుడు వాలంటీర్లు అంటూ చెప్పారు. వాళ్ళు పోలింగ్ బూతులకి కూడా వెళ్లి వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం జీతాలను తీసుకుంటూ ఒక పార్టీ కోసం పనిచేసే వ్యవస్థగా మారింది. చాలా ప్రమాదకరం అంటూ అభిప్రాయపడ్డారు. రేషన్ షాప్ కి పోయి బియ్యం, పెన్షన్ తెచ్చుకోవడానికి వాళ్ళ అవసరం లేదు కదా అంటూ అభిప్రాయపడ్డారు.