సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్ బిలీఫ్’ అనే అంశంపై మాట్లాడిన ఆయన, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో శాస్త్రీయ దృక్పథం ఎంతో కీలకమని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ఏ విషయాన్నైనా గుడ్డిగా నమ్మకూడదని స్పష్టం చేశారు. పరిశీలన, ప్రయోగాలు, ఆధారాలతో నిరూపించబడినదే సైన్స్ అని పేర్కొన్నారు. ఉదాహరణగా, మన చేతిలో నుంచి ఏదైనా వస్తువు పడిపోవడం గురుత్వాకర్షణ వల్లనే జరుగుతుందని, అది నమ్మకాల కారణం కాదని వివరించారు. సైన్స్ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ తన తప్పులను సరిదిద్దుకుంటుందని కూడా చెప్పారు.
మనిషి భావోద్వేగాలపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ, భయం, ఆనందం వంటి భావనలు అన్నీ మెదడు, న్యూరాన్లు, బయోకెమిస్ట్రీతో సంబంధం ఉన్న ప్రక్రియలేనని తెలిపారు. మనిషి జీవితం కోట్లాది సంవత్సరాల పరిణామ క్రమంలో రూపుదిద్దుకుందని గుర్తు చేశారు.
సమాజంలో సైంటిఫిక్ థింకింగ్ పెరగాల్సిన అవసరం ఉందని పూరి అభిప్రాయపడ్డారు. ఎవరైనా ఏదైనా అసాధారణ విషయాన్ని చెబితే, దానికి ఆధారాలు అడగాలని సూచించారు. ఆధారాలు లేనప్పుడు ఆ విషయాన్ని వెంటనే నమ్మకూడదని చెప్పారు. లాజికల్గా ఆలోచించడం ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు.
చివరగా తన మాటలను ముగిస్తూ, “సైన్స్ మిమ్మల్ని చంద్రుడి వరకు తీసుకెళ్తే, నమ్మకం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్లలో చర్చకు దారి తీస్తున్నాయి.

































