కరోనా, లాక్ డౌన్ వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఇంటికే పరిమితయ్యారు. అయితే చాలామంది సినీ ప్రముఖులు లాక్ డౌన్ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ సీజన్ ను కాస్తా పెళ్లిళ్ల సీజన్ గా మార్చేస్తున్నారు. తమ జీవిత భాగస్వాములతో ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మియా జార్జ్ వివాహం జరిగింది.

మియా జార్జ్ అంటే సులభంగా గుర్తు పట్టలేమేమో కానీ సునీల్ కు జోడీగా ఉంగరాల రాంబాబు సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి అంటే సులభంగా అర్థమవుతుంది. ప్రముఖ బిజినెస్ మేన్ అశ్విన్ ఫిలిప్ ను మియా జార్జ్ వివాహం చేసుకున్నారు. మొదట పలు టీవీ సీరియళ్లలో నటించిన మియా జార్జ్ ‘అమరకావ్యం’ అనే తమిళ సినిమా ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

పలు భాషల్లో మియా నటించిన ‘మిస్టర్ ఫ్రాడ్’, ‘మెమొరీస్’, ‘విషుధన్’, ‘రెడ్ వైన్’ సినిమాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మియా ‘కన్మణిల్ల’ అనే మలయాళ చిత్రంలో, చియాన్ విక్రమ్ ‘కోబ్రా’లో నటిస్తున్నారు. మియా వివాహం కేరళలోని కొచ్చిలో శనివారం రోజున ఘనంగా జరిగింది. లాక్ డౌన్ వల్ల అతి కొద్దిమంది మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
కొద్దిమంది బంధువులు, సన్నిహితులు వివాహ వేడుకకు హాజరయ్యారు. హాఫ్ వైట్, హై-నెక్ స్క్వీన్డ్ గౌనులో మియా ముస్తాబవగా, బ్లూ త్రీ పీస్ సూటులో అశ్విన్ మెరిశాడు. వివాహ వేడుకకు హాజరు కాలేని వారు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సంవత్సరం జూన్ నెలలో వీరి నిశితార్థం జరిగిన సంగతి తెలిసిందే.



























