Allu Arjun : బన్నీ సినిమాలతో ఎంత సక్సెస్ అయ్యాడో తన కమర్షియల్ యాడ్స్ తో కూడా అంతే పాపులర్. యాడ్స్ లో కూడా తన స్టైలిష్ లుక్ తో బ్రాండు వాల్యూ పెంచుకుంటూ పోతున్నాడు. అలాగే పబ్లిక్ లో ఇమేజ్ కూడా తెచ్చుకుంటున్నాడు.బన్నీ చాలానే వాణిజ్య ప్రకటనలలో కనిపిస్తున్నా లీగల్ గా ఎప్పుడు ఏ సమస్య రాలేదు. ఎందుకంటే బన్నీ ఇంతవరకు చేసిన యాడ్స్ అన్ని ఏవో ఒక సాఫ్ట్ డ్రింక్ లేదా ఏవో ఒక ప్రొడక్ట్స్ కి సంబంధించినవే. అయితే మొన్నామధ్య బన్నీ అందరికి షాక్ ఇస్తూ విద్యాసంస్థలకు ప్రచారకర్తగా మారాడు.
శ్రీ చైతన్య విద్యాసంస్థల యాడ్ చేసిన బన్నీ….

తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్, జేఇఇ వంటి ఫలితాలు వస్తే టీవీ పెట్టాలంటేనే భయమేస్తుంది. ప్రముఖ విద్యాసంస్థలన్ని మాదే మొదటి ర్యాంకు అంటూ ఉదరగోడుతుంటారు. అయితే ఇలాంటి ఒక యాడ్ బన్నీ చేస్తాడని బహుశా తన అభిమానులు కూడా అనుకుని ఉండరు. శ్రీ చైతన్య కాలేజీ తరుపున మొదటి ర్యాంకులు మావే అంటూ యాడ్ చేసాడు బన్నీ. అంతవరకు బాగానే ఉన్నా ఆ యాడ్ లో సమాచారం కరెక్ట్ గా లేకపోవడంతో ఇపుడు చిక్కుల్లో పడ్డాడు.

కొత్త ఉపేంద్ర రెడ్డి అనే వ్యక్తి శ్రీ చైతన్య కాలేజ్ పైనా ప్రచారకర్తగా ఉన్న బన్నీ పైనా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణపై అంబర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. నిజానికి ప్రచారకర్తగా ఉన్న వ్యక్తి ఆ బ్రాండు గురించి తెలుసుకుని ప్రచారం చేయాలి లేదంటే ఇలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా జరిగాయి. రియల్ ఎస్టేట్ వెంచర్ కి ప్రచారాలు చేసినప్పుడు ప్రముఖ నటి జెనిలియా పైనా, అమితాబ్ బచ్చన్ పైనా కేసులు పడ్డాయి. ఇపుడు ఈ కేసుపై బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

































