Babu Mohan : ఆహుతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్ ఆ తరువాత వచ్చిన మామగారు సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసిన బాబు మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తెరాసలో చేరిన బాబు మోహన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.

విషం పెట్టి చంపాలనుకున్నారు…
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ తనకు విషం పెట్టి చంపాలనుకున్న విషయాన్ని తెలిపి షాక్ కి గురిచేసారు. తనికెళ్ళ భరణి గారి వల్ల పాన్ బీడా తినడం అలవాటైంది. రోజుకి 30 దాకా పాన్లు తినే వాడిని అంతలా పాన్ కి బానిసయ్యాను. ఇక హైదరాబాద్ రావాలంటే మెదక్ నుండి సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని ఆ సమయంలో ఒక పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకుని వెళ్తుండడం అలవాటు. అలా ఒక రోజు కట్టించుకుని కొంత దూరం వెళ్ళాక తినాలనిపించి పాన్ డబ్బా తెరిచేలోగా పాన్ షాప్ అతను ఫోన్ చేసి తినొద్దని, అందులో విషం ఉందని చెప్పి పెట్టేసాడు. ఇక మళ్ళీ అతని భార్య ఫోన్ చేసి బాగా ఒత్తిడి చేసి ఇలా చేయమన్నారు అంటూ ఏడ్చి చెప్పింది. ఆరోజున అర్థమైంది రాజకీయాలు ఇంత ఉంటాయా అని అంటూ వివరించారు. ఇక పాన్ ను ఎలా మానేసారో కూడా చెప్పారు.

సెంట్రల్ మినిస్టర్ తో మీటింగులో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నపుడు వచ్చిన కేంద్ర మంత్రి బీడా తింటున్నారు. ఇక నేను ఊరికే ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను తిను పర్వాలేదు అన్నట్లుగా సైగ చేసారు కానీ నాకు ఆయన ముందు అలా తినాలని అనిపించలేదు. ఇక ఆ తరువాత మెల్లగా ఆ అలవాటును మానేసాను అంటూ చెప్పారు. టీడీపీ నుండి తెరాస ఆ తరువాత ఇప్పుడు బీజేపీ లో ఉండటం గురించి మాట్లాడారు. టీడీపీ, బీజేపీ రెండు ఒకే పార్టీనే నా దృష్టిలో, రెండూ కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు తెలంగాణ రాక ముందు వరకు రెండూ కలిసే ఉన్నాయి. ఇక తెరాస లో ఉన్న వాళ్లంతా టీడీపీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళే కావున ఇవన్నీ వేరే పార్టీలు ఎలా అవుతాయి. కాంగ్రెస్ మాత్రమే వేరే పార్టీ అంటూ వివరించారు.


































