ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్కు లంగ్స్ క్యాన్సర్ నిర్ధారణ అయినట్లు తాజా సమాచారం అందింది. ఈనెల 8న ఊపిరి సరిగా ఆడటం లేదని హీరో సంజయ్ దత్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అక్కడ కోవిడ్ పరీక్ష చేయగా నెగెటివ్ అనే రిజల్ట్ వచ్చింది. సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు సంజయ్.

అయితే మంళవారం మళ్ళీ సందేహం వచ్చి పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లి మళ్ళీ అన్ని టెస్ట్ లు చేయించుకున్న తర్వాత ఫైనల్ గా సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ అని రిపోర్ట్ వచ్చింది. దాంతో బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ మెరుగైన చికిత్సకోసం అమెరికాకు బయలుదేరి వెళ్తున్నారని ఆయన ఫ్రెండ్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. “లంగ్స్ క్యాన్సర్ బారిన పడిన నేను ట్రీట్ మెంట్ కోసం విశ్రాంతి తీసుకుంటున్నాను. నా కుటుంబం, నా మిత్రులు నాకు తోడుగా ఉన్నారు. నా గురించి నా ఫ్యాన్స్ ఆందోళన పడవద్దు. అలాగే సోషల్ మీడియాలో వచ్చే కధనాలను చదివి నాకోసం ఊహాగానాలు చేయవద్దని నా శ్రేయోభిలాషులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలతో త్వరలోనే కోలుకుని మళ్ళీ ‘బాలీవుడ్ ఖల్ నాయక్’ గా మీ ముందుకు వస్తాను’ అని సంజయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ ను షేర్ చేశారు.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. గతంలో సంజయ్ దత్ తల్లి.. ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ కూడా క్యాన్సర్ బారినపడే మరణించారు. ఆమెకు పాంక్రియాటిక్ కాన్సర్ సోకడంతో.. ఆ వ్యాధితో పోరాడుతూ ఆమె చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ వ్యాధి మూలంగా 1981లో ఆమె పరమ పదించారు. సంజయ్ కూడా తన జీవితంలో ఎన్నో కష్ట, నష్టాలను ఎదుర్కొన్నారు. చిన్న వయస్సు నుంచే సంజయ్ దత్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్టుగా ఆయన బయోపిక్ సంజు లో తెలియజేశారు. అలాగే గతంలో ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి సంజయ్ జైలుకు కూడా వెళ్లారు. ఈ మధ్యే ప్రశాంతమైన జీవితం గడుపుతున్న సంజయ్ కి లంగ్ క్యాన్సర్ రూపంలో మరో ఆపద వచ్చి పడింది. జీవితంలో ఎంతటి కోటీశ్వరుడైనా.. తనకెంత పేరు, ప్రఖ్యాతలున్నా సరే.. ప్రశాంతంగా జీవించలేరన్న సత్యానికి సంజయ్ దత్ జీవితమే ఒక నిదర్శనమని చెప్పవచ్చు. సంజయ్ ప్రస్తుతం ‘KGF చాఫ్టర్ 2’, ‘శమ్ షేరా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘సడక్ -2’, ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలు OTTలో విడుదల కానున్నాయి.



























