బాలీవుడ్ ధోనీ హీరో సుశాంత్ బలవాన్మరణం వివాదం సోషల్ మీడియాలో రోజురోజుకీ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ విషయంలో సుశాంత్ ఫ్యాన్స్ నుండి ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్న కరణ్ జోహార్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదిటంటే.. బాలీవుడ్ ను తన గుప్పిట్లో పెట్టుకుని కొత్తవాళ్లను ఎదగనివ్వకుండా న్యూ టాలెంట్ ను అణగద్రొక్కుతూ.. ప్రతిభ వున్నవాళ్ళను పైకి రాకుండా అడ్డుకుంటున్నారని నెటిజన్లు ఫైరవుతున్నారు. అసలు ఇలాంటి వాళ్లు సినీరంగంలో ఉండకూడదని.. వాళ్లకు తగిన శిక్ష వేయాలి అంటూ సుశాంత్ ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు.

ఈ నేపధ్యంలో ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్రస్ధానంలో వున్న కంగనా రనౌత్, శేఖర్ కపూర్ లాంటి లెజెండ్స్ కూడ బాలీవుడ్ లో జరుగుతున్న అన్యాయాలను గురించి ఫ్యాన్స్ ముందు గొంతు విప్పి చెప్పారు. సోషల్ మీడియాలో వీళ్ళ కామెంట్స్ చూశాక కరణ్ జోహార్, ఆలియా భట్, సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలి లాంటి బాలీవుడ్ ప్రముఖులపై ఇప్పుడు విమర్శలు చెలరేగుతున్నాయి. వీళ్లే బాలీవుడ్ ను హస్తగతం చేసుకొని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని.. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న నటీ, నటులను అణగతొక్కడానికి వీళ్ళెప్పుడూ సిద్ధంగా ఉంటారనే వివాదస్పదమైన గాసిప్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఏ మాత్రం టాలెంట్ లేని పనికిమాలిన వారసులను సినీరంగంలో నిలబెట్టడానికి వీళ్లు ప్రయత్నిస్తున్నారని ఉద్రేకపడుతున్నారు ఫ్యాన్స్.

ఇలాంటి భయంకరమైన సందర్భంలో కరణ్ జోహర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన సోషల్ మీడియా పేజీలలో కేవలం 8 మందిని మాత్రమే ఫాలో అవుతూ మిగిలిన వాళ్ళందర్నీ అన్ ఫాలో చేసేశారు. అందులో ఆలియా భట్, సోనమ్ కపూర్, అర్జున్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. కేవలం షారుక్ ఖాన్, పీఎం నరేంద్ర మోడీ, ఆయన స్టాఫ్ ఒక నలుగురు.. వీళ్లను మాత్రమే ఫాలో అవుతున్నారు బాలీవుడ్ బిగ్ బాస్. కరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తుంది. ఇదంతా చదువుతుంటే మీకు ‘అడుసు త్రొక్కనేల.. కాళ్ళు కడగనేల.?’ అనే పాత సామెత గుర్తొస్తుంది కదూ..!



























